Friday, July 13, 2012

ఆత్మ సాక్షాత్కారము

   ఆత్మ సాక్షాత్కారము
               యోగము గురించి తెలుసుకున్న తర్వాత వచ్చే స్థాయి ఆత్మదర్శనం. ఇది ఆయా వ్యక్తుల పరిస్తితిని బట్టి రకరకాలుగా వుంటుంది. సద్గురువులు పోడూరి కృష్ణవేణుమాతాజీగారు అనుభవపూర్వకముగా చెప్పినదేమిటంటే, మనం కళ్ళు మూసుకొన్న తర్వాత కనిపించేది చీకటి. ఆ చీకటిని చూస్తూనే, మనం ఏకాగ్రత కోసం ప్రయత్నించాలి. అందులోనే మనకు రక రకాల భావాలు, ఆలోచనలు, ఊహలు, కోరికలు మొదలైనవి కలుగుతూ వుంటాయి. కాని మనం ప్రయత్నపూర్వకముగా వాటిని ప్రక్కకు త్రోసివేసి మనస్సుని ఎటువంటి ఆలోచనలకూ లోను గాకుండా ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నానికి ఉపయోగపడేదే గురూపదేశమంత్రము. దాన్ని మననం చేసుకొంటూ మనస్సుని ఏకాగ్రతగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూవుండాలి. అలా కొంతకాలానికి మనస్సు ఎటువంటి ఆలొచనలూలేకుండా నిలబడుతుంది. ఆసమయంలో ఆ చీకటిలొ ఒక్కసారి తళుక్కున మిణుగురు పురుగు వెలిగి ఆరిపోయినట్లు ఒక త్రసరేణువు లాంటి సూక్ష్మమైన కాంతి వెలిగి ఆరిపోతుంది. ఇది సెకనులో లక్షోవంతులో జరుగుతుంది. ఇక్కడితో మనం ఆగిపోకూడదు. ఆ ధ్యాన్నాన్ని అలాగే పట్టుదలతో కొనసాగించాలి. అలా చేస్తూ వుంటే, వెలిగి ఆరిపోతున్న త్రస రేణువు చాలా సార్లు కనపడుతుంది. కొన్నాళ్ళకి అది ఆరి పోకుండా అలాగే నిలబడుతుంది. దాన్నే గమనిస్తూ, మనం ధ్యాన్నాన్ని కొనసాగిస్తూ వుంటే, ఆ త్రస రేణువు యొక్క పరిమాణం పెరిగి పెద్దదై, పౌర్ణమి నాటి చంద్రుని అంతై, ఇంకా పెరిగి, మన దృష్టి ఎంతవరకూ వుంటుందో, అంతవరకూ పెరుగుతుంది. (180 degrees ఇంకా చూడగలిగితే 360 x 360 degrees) వారి వారి స్థాయీలను బట్టి దాని రంగులు కూడా మారుతూ వుంటాయి.  ఇక్కడ చెప్పుకోవలసిన గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఇటువంటి అనుభవాల గురించి, ఏ పురాణంలోను, ఉపనిషత్తులోను, ఇంకా ఏ ఆధ్యాత్మికగ్రంధంలొనూ ఉదహరించి యుండలేదు. ఇది కేవలం సద్గురువుల దగ్గర, ఇటువంటి అనుభవం కలిగిన వారి శిష్యులదగ్గర మాత్రమే వినటం, తెలుసుకోవడం జరిగింది. మేము ఉదహరించిన పైవిషయములో ఏమైనా పొరపాట్లు వుంటే, శ్రీగురుమండలిని క్షమాపణ కోరుతున్నాము. కాని ఈ స్థాయి గురించి, ఈ అనుభవం పొందిన వారి స్థితి గురించి కొంత సమాచారం లభ్యమైనది. వాటిని మీ ముందుంచుతున్నాము.

యోగవాసిష్ఠము:ఉత్పత్తి ప్రకరణము:111వ సర్గ:
           
4. ఆత్మ సాక్షాత్కారమను యత్నముచే చిత్తమను బాలుడు, మిథ్యయగు  సాంసారిక పదార్థసముదాయము నుండి తొలగింపబడి, ఆత్మ స్వరూపమును సత్యవస్తువు యందు నియోజితుడై జ్ఞానయుక్తుడు గావింపబడి రక్షింపబడుచున్నాడు.
            7. ఉత్తమ ఫలదాయకమగు సమాధియను సత్కర్మ యందు మనస్సు నుపయోగించి, అట్టి సమాధి ద్వారా చిదాత్మ తోటి మనస్సు నైక్యపరచవలెను.
             13. ఆత్మ సాక్షాత్కార సాధ్యమగు మనో నాశముచే (మనో నాశ మంటే, మనస్సును ఆలోచనలు లేకుండా చేయటం) కామాది శత్రురహితమై ఆద్యంతరహితమగు స్వరాజ్య సుఖము నీదేహముండగనే సంపాదింపుము.
             16. ఆత్మ సాక్షాత్కారముచే సంకల్పములను, అనర్థములను నిర్మూలన మొనర్చు టచే ప్రశాంతమగు జీవన్ముక్త స్థితి లభించును. మనుజ దేహధారి, అధికారి యగు జీవున కిద్దాని యందు క్లేశమేమి కలదు?
              18-20. ప్రసిద్ధమగు ఉత్తమబ్రహ్మపదమును చిరకాలాభ్యాసముచే పొంది పిదప యంతిమ సాక్షాత్కార వృత్తిచే నావిర్భూతమగు చైతన్యముచే అవిద్యను సంపూర్ణముగ నశింపజేసి, చిత్తము నాత్మయందు లయపరచి, చిత్తమునకు పరమైన పూర్ణాత్మ స్వరూప మును బొందుము. ఇట్లొనర్చుటకై, ప్రధమమున చిద్వస్తుభావన జేసి, పిదప యద్దానిని స్థిర పరచుట యందే మిక్కిలి సావధానముగా బుద్ధిని వినియోగింపుము. ఆ పిమ్మట స్వస్థ చిత్తు డవై, చిత్తమును గూడ గ్రసించునదియు, చిత్తమునకు పరమైనదియు నగు పరమాత్మ యందు నిలకడగల్గి యుండుము.  ఆత్మసాక్షాత్కారరూపమగు ఉత్తమపురుష ప్రయత్నమునాశ్రయించి, చిత్తము నచిత్తము చేసి, ప్రసిద్ధమును, శాశ్వతమునగు బ్రహ్మపదమును పొందుము.
                30-32. ఏ యుపేక్ష లేనిదియు, శక్తివంతమును, సర్వహితమును, మాయాదోష రహితమును, శృతి ప్రతిపాదితమును నగు పరమాత్మ యందు చిత్తమును లయమొనర్చుట చేత తప్ప మరియే యుపాయముచేనైననూ, ముక్తి లభింపనేరదనుట, స్వర్గ, పాతాళ, ద్వీప, ద్వీపాంతరములందున్న తత్త్వవేత్తలందరి యొక్క ధృఢ సమ్మతమైనది. (ఇక్కడ ద్వీప, ద్వీపాంతరములనే మాటలను బట్టి దేశ, విదేశ ములలోనున్న తత్త్వవేత్తలతో సంబంధము లుండెడివి అనే విషయం రూఢి అవుతోంది). చిత్తోప శామనముచే కేవల చిన్మాత్ర వస్తువు శేషించుటయే ముక్తి. చిత్తోపశమనము తప్ప ముక్తి బొందుటకు మరొక ఉపాయము లేదు. సత్యమును, త్రికాలాబాధ్యమును, వ్యాపకమును, అజ్ఞానమాలిన్యరహితమునగు ఆ ఆత్మ సాక్షాత్కార రూపమైన ప్రభోధము హృదయమున నుత్పన్నము కాగా, జీవునకు పరమ శాంతి లభించును. అతి విస్తీర్ణమగు హృదయకాశామున అంతిమ బ్రహ్మకారవృత్తిచే ప్రకాశమానయగు చిద్రూపచక్రముచే ఛేధించివేయుము. అపుడు మానసికవ్యధలేమియూ నిన్నుబాధింపజాలవు.  ఆత్మవేత్తలకు సంమతమును, పరమపవిత్రమును, అమనస్కమును, అహంకారవర్జితమును, దుఃఖరహితమును, శాంతమును, జన్మవికార శూన్యము నగు ఆత్మ పదమును నీవు పొందెదవు గాక.

ఉపశమ ప్రకరణము: 8వ సర్గ: సిద్ధగీత  (ఆత్మతత్త్వము):
        
9-13. నేత్రేంద్రియముల ద్వారా స్రక్చందనాది విషయసంయోగముచే నుద్భవించు విషయకార బుద్ధివృత్తియందే యానందరూపము నిశ్చయింపబడుచున్నదో, అట్టి నిరతిశయ భూమానందస్వరూపమైన ఆత్మను నిర్వికల్పసమాదిచేతను, బాహ్యాభ్యంతరేంద్రియ నిగ్రహము చేతను మేము నిరంతరము నుపాసించుచున్నాము. ద్రష్ట, దర్శనము, దృశ్యరూపమగు త్రిపు
టిని వాసనలతోగూడ పరిత్యజించి, నేత్రాది ఇంద్రియముల (లేక మానసిక) వృత్తులను, సాక్షిరూపమై భాసిల్లు ఆత్మరూపమును, అనగా బీజసహిత త్రిపుటీ పరిత్యాగముచే, తురీయ మగు ఆత్మను నిరంతరముపాసించుచున్నాము. నేత్రేంద్రియాదుల జ్ఞానమునకు పూర్వమే భాసించునట్టి సాక్షిరూప సత్తా విషయమై, 'ఇది కలదు', 'ఇది లేదని' వాదించు వారియొక్క అస్తిత్వనాస్తిత్వములు రెండునూ సాక్షి లేకయే సిద్ధింపజాలవు. కావున అస్తిత్వనాస్తిత్వ పక్షములు రెండింటియందును, మధ్యగతమై, సాక్షి రూపమున వెలుగొందుచూ, ప్రకాశ్య వస్తువుల గూడ ప్రకాశింపజేయునట్టి ఆత్మను లెస్సగా నుపాసించుచున్నాము. లేక, అస్తిత్వ నాస్తిత్వములు రెండునూ, ఏక కాలములో యసంభవమగుటచే, రెంటియందునూ యను గతమై సన్మాత్రరూపమున సమస్త ప్రకాశ్య పదార్ధములను ప్రకాశింప జేయునట్టి ఆత్మ వస్తువును నిత్యమూ మేముపాసించు చున్నాము. (ఇది చాలా గమ్మత్తైన statement. ఉన్నది, లేదు అని ఏది భావింపబడుతోందో, ఆ భావాల రెండింటికీ మధ్య అది, దేన్నీ అంటుకొనకుండా, వాటికి విడిగా సాక్షిభూతముగా ఏదైతే వుంటోందో, దాన్ని మేము ఉపాసిస్తున్నాము అని సిద్ధులు చెపుతున్నారు. దేన్నయితే లేదు అని అంటున్నామో, ఎక్కడో, నామమాత్రముగా దాని ఉనికి వున్నట్లేగా! అదీ విషయం.)  అకారమాదియందు హకారమంతమునను కల అహం పదమునకు మాన్యమును, సర్వ వస్తుప్రకాశకమును, వేదశాస్త్రాదులందనుగతమై యున్న అకారాది హకారాంతము వరకూ గల సర్వాక్షర సముదాయ రూపమగు శబ్దజాలమందు అంతర్గతుడైయుండుటచే సర్వాకారుడును నగు నిర్గుణ బ్రహ్మమునందు స్థితికల్గి 'సోహం' మంత్రమును శ్వాసోచ్చ్వాసములచే నిరంతరము జపిమ్చుచున్న యాత్మతత్త్వమును లెస్సగా నుపాసించెదము. ('సోహం' అనగా 'అదే నేను' అని అర్థం. 'అహం బ్రహ్మస్మి' అనే మహావాక్యా నికి ఇది మంత్రరూపం. ఇది ప్రతీ వ్యక్తి లోను వారికి తెలియకుండా ఉఛ్వాసంలో 'సో' అని, నిశ్వాసంలో  'హం' అని నిత్యజపం జరుగుతూవుంటుంది. దీన్నే 'అజపా గాయత్రి' అని అంటారు. అలా తెలియకుండా జరిగే దీనివల్ల ఏమాత్రం ఉపయోగం లేదు.  ఏదైనా పుస్తకంలో చూసి, లేదా దీన్ని చదివి జపం చేసేద్దాము అనుకుంటే అస్సలు ఉపయోగం లేదు. జ్ఞానపరంగా, ఆధ్యాత్మికముగా, మానసికముగా, పరిపక్వత సాధించిన శిష్యునికి, గురువు, దీన్నినియమిత పధ్ధతి ప్రకారం ఉపదేశించి,  ఈ మహామంత్రాన్ని శ్వాసకు ఎలా అనుసంధానించాలో, దృష్టిని, దానితోపాటు మనస్సును ఎక్కడ కేంద్రీకరించాలో, మొదట ధ్యానాన్ని, ఆతర్వాత సహజంగా మారే ఆయోగాన్ని ఎలా చెయ్యాలో, తన స్వంత పర్యవేక్షణలో, శిష్యునిచేత చేయిస్తాడు. అప్పుడు మాత్రమే, ఈ సాధన ఫలిస్తుంది. దీన్నే మేము చేస్తున్నాము అని సిద్ధులు చెపుతున్నారు.)
             18. బాహ్యాభ్యంతరేంద్రియ వ్యాపారముల నిరోధించి, తద్వారా విషయజనిత దుఃఖమునురహితమొనర్చి, ఆత్మసుఖసంపాదన యెనర్పవలెను. అట్టి ఉపశమము (ఇంద్రియ వ్యాపార నిరోధము)చే యింధనములేని అగ్నివలె చిత్తము పూర్ణముగా శమించును. చిత్తము శమించినవానికి పరమార్థభూతమై సుఖరూపమైన ఆత్మయందు చిరకాలముత్తమస్థితి లభించును.
           13వ సర్గ :85: వైరాగ్యము చేతను, ప్రాణాయామము చేతను, సమాధి చేతను, వ్యసన క్షయముచేతను, పరమార్థ బ్రహ్మజ్ఞానము చేతను, ప్రాణవాయువు నిరోధింపబడును.
           14వ సర్గ: 53: జాగ్రత్స్వప్నసుషుప్తరహితమై, వాటన్నింటికినీ సాక్షీభూతమై వెలయునట్టి ఆత్మను భావించుచూ, స్వయముగ ఆత్మయందు స్థితుడవుగమ్ము.                     

         16వ సర్గ: 16, 17: సమాధి యందారూఢుడును, సమాధివ్యత్థానకాలమున వ్యవహరించు వాడును నగు వారిరువురూ (జీవన్ముక్త, విదేహముక్తులు) సుఖవిశ్రాంతి బడయువారై, అవిద్యా వలయరహితులై, కేవలము బ్రహ్మపదమున స్థితులయ్యే వుందురు.  కాని యందొకరు (జీవన్ముక్తుడు) దేహసహితుడుగను, మరియొకడు (విదేహముక్తుడు) దేహరహితుడుగను యుండును. దేహముతోగూడి దుఃఖరహితు డగును. దేహమును త్యజించి జ్ఞేయవాసనాత్యాగియై యొప్పును.
             34వ సర్గ:16, 17: మహాత్త్వరహితమై, మనోవర్జితమై, శాంతమై, పంచేంద్రియభ్రమ రహితమై, సంకల్పవర్జితమైనట్టి శుద్ధచైతన్య రూపమగు ఆత్మమాత్రుడనే నేను. (ఇవన్నీ శుద్ధమైన ఆత్మ యొక్క గుణములు. ఇటువంటి ఆత్మ మాత్రమే 'నేను' అని పిలువబడుతోంది. భగవాన్ శ్రీరమణులవారు లేవనెత్తిన 'నేనెవడను?' అనే ప్రశ్నకు సరియైన సమాధాన మిదియే!) విషయ వర్జితమును, సర్వప్రకాశకమును, బాహ్యాభ్యంతరములందు వ్యాప్తమును, నిష్కళంకమును, నిర్మలమును, సద్రూపమును నగు చిన్మయమును నేనే.
              50వ సర్గ: 36: కర్తృ, కర్మ, కరణ సహితుడవై, విజ్ఞానమయమగు బుద్ధి, బాహ్య విషయములు, ఇంద్రియములు, వీనితొ గూడి నిన్ను స్పృశింపనేరని సంసారము, స్వామ్తర్గతమున, ప్రతిబింబము మాడ్కి స్పృశించును. అనగా సాక్షి రూపమున సర్వ వ్యవ హారములు గాంచును.  నిర్వికల్పమును, నిరాలంబమును, కేవల నిజరూపమునునగు చిన్మాత్రమందు నిష్ఠ గల్గియుండుము.
              43. నిర్మలమును, నిరవయమునునగు నిజచైతన్యమున స్థితికలుగగనే, సంసారభ్రమ కారణమగు మహామోహము క్షయించును.
              54వ సర్గ: 70: నిర్వికల్ప సమాధి యందలి బ్రహ్మనాదసుఖమే పరమ పదము. అదియే శామ్తగతి. అదియే నిత్యశ్రేయము. అచ్చోట నిద్రించిన వానికి భ్రమ ఎన్నటికి బాధించదు.
              62వ సర్గ: 6: నిత్యప్రబుద్ధ (జ్ఞాన సహిత) చిత్తులు ప్రపంచ క్రియల నొనర్చుచున్ననూ, సదా ఎకతత్వ (ఆత్మ) నిష్ఠులై ఉత్తమ సమాధి యుతులై యుందురు. (జీవన్ముక్తుల జీవన విధానము ఇలా వుంటుంది. ఈ ప్రపంచంలో వుంటూనే, తమ మనస్సును  నూటికి తొంభై తొమ్మిది పాళ్ళు ఆపరమాత్మ మీద లగ్నంచేసి, ఇంకా జీవితం వుంది కాబట్టి, కాలం గడుపుతూ వుంటారు. అవుసరమయినంత మేరకు ఈ ప్రాపంచిక సంభంధమైన పనులు చేస్తూ వుంటారు. 'బాబా' సినిమాలో రజనీకాంత్ పాడినట్లు తామరాకు మీద నీటిబొట్టులా వుండటమంటే ఇదే. శ్రీశుకులవారు, జనకమహారాజు, సంత్ జ్ఞానేశ్వర్, భక్త తుకారాం, భక్త నామదేవులు మొదలగు వారు దీనికి ఉదాహరణలు.)
              8, 9: ఎకాగ్రమును, నిత్యతృప్తమును, సత్య వస్తువు నవలోకించునదియు, అబాధితమునగు ఆత్మతత్త్వమును దర్శించునదియు నగు పరాప్రజ్ఞయే సమాధి యని పెర్కొనబడును. (ఆత్మను సంపూర్ణముగా దర్శింపజేసేదే సమాధి. ఆ స్థితిలో మొదట్లో చెప్పుకోన్నట్లు మన దృష్టి ఎంతవరకూ విస్తరించుతుందో అంతవరకూ, రాకాపున్నమి నాడు వచ్చే వెన్నెలరంగులో విస్తరించి ఆత్మ దర్శనం కలుగుతుంది. సరిగ్గా ఈ స్థితినే, "వేదాంత వీధులలొ విహరించు గిరిధారి" అనే పాటలో, ఒక చరణంలో "పండు వెన్నెల రేయి, నిండు పున్నమి హాయి" అని పాడతారు. ఆ
పండు వెన్నెల, నిండు పున్నమి, సమాధి స్థితిలో కలిగే ఆత్మదర్శనానుభూతి తప్ప భౌతికమైనవి కావు.) సమస్త ఆశలను తృణమునకు అగ్నివంటిదగు ఆత్మతత్త్వబోధయే సమాధి యనబడును గాని, తూష్ణీం స్థితి గాదు. [సమాధి అంటే, ఆత్మ చైతన్యము తొణికిసలాడే స్థితి తప్ప, మరచి పోయే మత్తు లాంటిది (neglected, drowsy state) కాదు.]
               12. ఎప్పటినుండి మనస్సు సదా (పారమార్ధిక) జ్ఞానయుక్తమైయుండునో, అప్పటినుండియే, అమ్మహాత్మునకు నిరంతర సమాధి సిద్ధించినదగును.
 
అష్టావక్ర గీత: 17వ ప్రకరణము: తత్త్వజ్ఞ రూపవింశతికము: (ఆత్మజ్ఞాని లక్షణము):
            1, 2 : ఎవడు ఎల్లప్పుడూ తృప్తుడై ఉంటున్నాడో, ఇంద్రియశుద్ధి కలవాడై, ఎట్టి సంగమము లేని వాడై ఆనందించుచున్నాడో, వానిచేత జ్ఞానఫలం, ఆ ప్రకారమే యోగాభ్యాస ఫలం పొందబడుచున్నవి. తత్త్వజ్ఞాని ఈప్రపంచమందు ఎప్పుడూ కూడ ఖేదమును పొందడు. ఇది నిశ్చయము. ఎందువలననగా, ఒక్కడగు అతని చేత ఈ బ్రహ్మండమంతయూ నిండి యున్నది. (ఆ సమయములో అతను నేను పరబ్రహ్మ స్వరూపమును అనే నిశ్చయజ్ఞానము పొందివుంటాడు. అందువల్ల ప్రాపంచిక విషయములేమియూ అతనిపై ప్రభావము చూపలేవు.)
             10. ఎంత ఆశ్చర్యము? మేల్కొనుట లేదు. నిద్రించుటలేదు. కంటి రెప్పలను తెరచుట లేదు. మూయుట లేదు. ముక్తచేతసుడగు జ్ఞానికి ఒకానొక ఉత్కృష్ఠ దశ వుంటున్నది. (ఇదే, ప్రపంచములో వుంటూనే ఆపరబ్రహ్మముతో అనుసంధానింపబడి జీవించడం. ఇదే జీవన్ముక్త దశ.)
              17. ఎవడు విషయములను ద్వేషింపడో, వాటియందు లోలత్వమును కూడ చూడడో, ఎవని మనస్సు నిరంతరము అనాసక్తమై దేనినీ ఆశింపదో, ప్రారబ్దవశమున ప్రాప్తమగు దానిననుభవించుచూ, అప్రాప్తమగు దానిని కోరడో, అతడే జీవన్ముక్తుడగుచున్నాడు.
               20. నశించిన మనస్సు గల జ్ఞాని మనఃప్రకాశమునుండియూ, చిత్తభ్రాంతినందియూ, జడత్వరూప నిద్రనుండి విడివడినవాడై, అనిర్వాచ్యమైన ఒకానొక దశను పొందినవాడుగా నగును.

  
(www.tatvavisleshana.weebly.com ని దర్శించండి. మీ స్పందనల కోసం ఎదురు చూస్తూ వుంటాము.)
   

No comments:

Post a Comment