Tuesday, July 10, 2012

యోగము

                                 యోగము
                మనం జ్ఞానము, యోగముల యొక్క పూర్తి ఆవశ్యకత గురించి తెలుసుకొన్న తర్వాత, జ్ఞానాన్ని పరిపక్వం చేసేది, ధ్యానము యొక్క తదుపరి స్థితి, విశిష్టమైన అనుభవన్నిచ్చేది, ఆత్మదర్శనమునకు మార్గము, పరబ్రహ్మానుభవమునకు మొదటిమెట్టైన చైతన్యభావాన్ని కలిగించేది, సమాధిస్థితిని కలిగించేది, అఖండానందైకరసానుభూతిని పొందించేది, అయినటు వంటి యోగము గురించి తెలుసుకుందాము. ఈ యోగం విషయమై అనుభవజ్ఞులు ఏమి చెప్పారో తెలుసుకుందాము.

కఠోపనిషత్:ద్వితీయాధ్యాయము:6వ వల్లి: 
             11. స్థిరమగు ఇంద్రియధారణనే యోగమని చెప్పెదరు.  అట్టి స్థితియందు యోగి అప్రమత్తుడై యుండును.  ఈ యోగమును పొందవచ్చును. అజాగ్రత్తచే పోగొట్టుకొనవచ్చును. (చాలామందికి యోగమంటే గాఢమైన నిద్రాస్థితి అని అనుకొంటున్నారు. కానికాదు. యోగము లో బాహ్యచైతన్యము లేనట్లుకనపడినా, ప్రాణ చైతన్యము, పరా చైతన్యము పూర్తి స్థాయిలో పనిచేస్తూవుంటాయి. యోగములో మనము  బాహ్య ప్రపంచానికి జాగ్రదావస్థలో లేనట్లు కనపడినా, జాగ్రత్స్వప్నసుషుప్త్యావస్తల కన్న వేరేదైనటువంటి స్థితిలో వుంటాము. ఆస్థితిలో మన conscious, sub-conscious కూడా మన చెప్పుచేతలలో వుంటాయి. ఇవి కాకుండా, మన అంతఃకరణాలైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము కూడా మన అదుపులో వుంటాయి. మన ఆత్మ astral travel చేస్తున్నా, పై పై స్థాయిలకు వెళుతూ, అక్కడ మనకు తెలియని అను భూతులు, అనుభవాలు, సిద్దులైన ఆత్మలతో పరిచయం కలిగినా, అవన్నీ క్రింద భూమిపైన మన శరీరములోని చిత్తానికి తెలుస్తూ వుంటాయి. తర్వాత
వాటిని మిగిలినవారికి వివరించ గలము  కూడా. చూసారా! యోగమంటే ఎటువంటి అప్రమత్తమైన స్థితియో! వెంటనే మనకు ఒక హెచ్చరిక కూడావస్తోంది. ఏమాత్రము అజాగ్రత్తగా వున్న అటువంటి ఉన్నతమైన యోగస్తితి నుండి పడిపోతాము. తిరిగి దాన్ని పొందటము చాలా కష్టము.)

వివేకచూడామణి:
       9.చిత్తనిరోధరూపయోగారూఢభావమును పొంది తత్వసాక్షాత్కారనిష్టతో సంసారనిమగ్ను డయ్యునూ, తననుతానే ఉద్ధరించుకొనవలెను.

యోగవాసిష్ఠము: ఉపశమ ప్రకరణము:78వ సర్గ:
        8. చిత్తనాశమునకై యోగమనియు, జ్ఞానమనియు యిరుతెరగులగు నుపాయములు చెప్పబడినవి. అందు యోగము చిత్తవృత్తి నిరోధమున్ను, జ్ఞానము సమ్యక్ దర్శనమున్ను నగును.
        15. వేదరహస్యమెరింగినవారు ప్రాణస్పందమునే చిత్తమని పేర్కొనిరి. కాన ప్రాణ నిరోధముచే చిత్తమున్నూ తప్పక ఉపశమించును. (మనకు మొదట్లో అంటే, క్రింద స్థాయిలో, బాగా అర్థమగుటకు, అంతఃకరణలు
మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము విడివిడిగా నాలుగు అని చెప్పారు. కాని నిజానికి, ఇవిఅన్నీ ఒక్కటే. ఇంకా పైస్థాయికి వస్తే, యివన్నీ మనప్రాణములో, అంటే మన ఆత్మలో వున్న క్రిందిస్థాయి భాగాలని అనుభవ పూర్వకముగా తెలుసుకుంటాము. ఇంకా చెప్పాలంటే, ఆత్మ యొక్క భౌతిక రూపమే ప్రాణము. ప్రాణము యొక్క శక్తి రూపమే (energy-part) ఆత్మ.     శరీరములో ఉన్నటువంటిది, అజ్ఞానములో ఉన్నటువంటిది ప్రాణము, జీవుడు. అదే, జ్ఞానవంతమైనా, శరీరమును వదిలివేసినా ఆత్మ అవుతుంది. రెండిటికీ వాస్తవానికి తేడాలేదు. కాబట్టి ఎప్పుడైతే చిత్తాన్ని, అదే అలోచించటాన్ని ఆపుచేశామో, చిత్తము దానితోపాటు మనస్సు కూడా పనిచేయడం మానేస్తాయి. కిటుకు ఏమిటంటే, అంతఃకరణాలలో ఏఒక్కదానినైనా పట్టుకొని, దాన్ని పనిచేయకుండా ఆపుచేస్తే, మిగతావి కూడా పని చేయడం మానేస్తాయి. కారణం ఏమిటి? అవన్నీ ఒక్కటేకాబట్టి. అమనస్కయోగము అంటేఇదే. కాబట్టి ఈవిషయాన్ని తెలుసుకొని, ఉపక్రమించండి. తప్పక ఫలితం వస్తుంది.)
           18-21. శాస్త్రసజ్జనసంపర్కము చేతను, వైరాగ్యాభ్యాసముల చేతను పూర్వాభ్యస్తము లగు సాంసారికవృత్తులందలి విశ్వాసము దృఢపడ, ఏకాగ్రత చేత నుదయించిన యభిమత ధ్యానముచేతను, ఏకతత్త్వము యొక్క దృఢాభ్యాసము చేతను, సుఖపూర్వకముగా సిద్ధించిన పూరకాది ప్రాణాయామము చేతను, ఏకాంత ధ్యానయోగము చేతను ప్రాణస్పందము నిరోధింప బడును. (మనం కొద్దిసేపు ధ్యానము చేసి, నాకు మనస్సు నిలకడ కుదరటంలేదు అను కొంటాము. కాని అది నిరంతరంగా అవలంభించాల్సిన ప్రక్రియ. అలా చేస్తూ వుంటే కొంత కాలానికి నిలబడుతుంది. ఎంతవరకూ అన్నది ఆ వ్యక్తిపై ఆధారపడి వుంటుంది. అలా ఏకాగ్రత నిలబడటానికి వివిధ ఉపాయాలు చెపుతున్నారు. శాస్త్రములను అధ్యయనం చేయటంచేత, యోగుల సంపర్కము చేత, వైరాగ్యాన్ని సరియైన రీతిలొ అభ్యసించటం చేత, సాంప్రదాయ ప్రాణాయామము చేత, ఏకాంత ధ్యానము చేత, మనస్సు నిలుస్తుందని చెప్పారు. ఇంకా ముందర చాలా ఉపాయాలు చెప్తారు జాగ్రత్తగా గమనించండి. ఇన్నిరకాల ఉపాయాలు చెప్పడం ఎందుకూ ఆంటే, ఒక్కక్కళ్ళకి ఒక్కక్కటి పనికివస్తుంది కాబట్టి!) ఓంకారమును దీర్ఘముగా నుచ్ఛరించి, యద్దాని చతుర్ధమాత్ర నవలంభించి, శబ్దార్థములను భావన చేయుటచే, బాహ్య విషయజ్ఞానము పూర్ణముగా నుపశమింప నత్తరి ప్రాణస్పందము నిరుద్ధమగును. [ఓంకారాన్ని మననోటితో ఎంతవరకూ అనగలమో, అంతవరకూ అని, తదుపరి దానిని మనస్సుతో పొడిగిస్తే, అందులో, అర్థమాత్ర మిగులుతుంది. అంటే, అకార, ఉకార, మకారములు లయించిపోయి, అక్షరరహిత శబ్దము, అదే నాలుగవది అయిన అర్థమాత్ర మిగులుతుంది. (దీనినే నాదబిందువు అని కూడా అంటారు. దీని గురించి ఇంకొకసారి తెలుసుకొందాము) దీనియొక్క శబ్దము మరియు అర్థములను తెలుసుకొని భావన చేస్తే, బాహ్యజ్ఞానము పూర్తిగా పోయి ఏకాగ్రత కుదురుతుంది. శృతి "తస్య వాచకః ప్రణవః; తజ్జప స్తదర్థభావనః" అని చెప్తోంది. ఆ శుద్ధగంభీర నిరాకార పరమాత్మ యొక్క సర్వనామము (pronoun) ప్రణవమని, దానిని జపించుటవలన ఆ పరమాత్మయోక్క అర్థమూ, భావన కలుగుతాయని దీని భావము. దీనివల్ల స్థిరమైన ఏకాగ్రత కుదురుతుంది.]
            27-31. నాసికాగ్ర భాగమున నిర్మలాకాశము నందు పన్నెండు అంగుళముల వరకు మనోదృష్టుల నిరోధించుటచే ప్రాణస్పంద నిరోధము కలుగును. అభ్యాసముచే తాలువుపై
పన్నెండు అంగుళముల మేరనున్న బ్రహ్మరంధ్రమందు ప్రాణ వృత్తి లయింప ప్రానస్పందము నిరోధింపబడి శాంతి నొంద, పైరీతి ప్రాణమును బ్రహ్మరంధ్రమున బ్రవేశపెట్టుటచే చిన్మాత్ర నిరుద్ధమగును. (దీనినే 'మండలబ్రాహ్మణోపనిషత్' లో 'బహిర్లక్ష్యము' అని చెప్పినారు. బహిర్లక్ష్యము అనగా మన శరీరమునకు బయటనున్న లక్ష్యము. ముక్కు కొస నుండిగాని, తాలువు, అనగా నాలుకపైన నుండే నోటియొక్క భాగము, నుండిగాని, పన్నెండు అంగుళముల పైన మన దృష్టిని, మనస్సును కేంద్రీకరించాలి. అది సరిగ్గా మన శిరస్సు పైభాగాన ఆకాశములో వుంటుంది. అక్కడ దృష్టిని కేంద్రీకరిస్తే, ఆ దృష్టితో పాటు మనస్సుకూడా అక్కడే వుంటుంది. ఇది అభ్యాసము పై వస్తుంది. ఇక్కడ పన్నెండు అంగుళములంటే పన్నెండు స్థాయీలని కూడా చెప్పుకోవచ్చు. మీకు ఇంకొక ఉదాహరణ ఇస్తాను. ఇది చాలా పాత చిత్రము. చేతితో వేసినదను కొంటాను. ఎక్కడైనా లభ్యమైతే చూడండి. విశ్వామిత్రుడు తపస్సు చెస్తూవుంటే పైనుండి మేనక వస్తూవుంటుంది. అక్కడ విశ్వామిత్రుడు తపస్సు చేస్తూవున్న భంగిమ జాగ్రత్తగా గమనించండి. ఒంటి కాలిమీద నిలబడి, రెండు చేతులూ పైకెత్తి నమస్కరిస్తూ, తల పైకెత్తి, కలిసివున్న ఆరెండు చేతుల కొసలు చూస్తూ వుంటాడు. ఆ రెండు చేతుల కొసలు వున్న ప్రదేశమే, ఇక్కడ చెప్పినటు వంటి చోటు. ఆ ఫోటోలో లాగా ఇప్పుడు మనం ఫోజు పెట్టనవసరం లేదు. కళ్ళరెప్పలు మూసు కొని, కను గ్రుడ్లని పైకెత్తి, ఆ ప్రదేశాన్ని భావిస్తూ, మన మనస్సుని అక్కడ కేంద్రీకరించడానికి ప్రయత్నించండి. అదే నిజమైన బ్రహ్మరంధ్రము. అది నిజానికి మన శరీరములొ లేదు. దీనినే వశిష్ఠులవారు చెప్పారు.) గురు ఈశ్వరానుగ్రహముచే కాకతాళీయముగా ఆత్మజ్ఞానము శ్రీఘ్రముగా జనింప, నియ్యది వికల్పంశరహితమై, దృఢపడ, ప్రాణ చలనము నిరుద్ధమగును. (ఇది కేవలము ఆ పరమాత్మకు, సద్గురువులకు మాత్రమే సాద్ధ్యపడే విషయము. వారికి, ఎవరిపైనేనా అపారమైన ప్రేమానురాగాలు, జాలి కలిగితే, వారి అనుగ్రహంతో ఆ వ్యక్తికి మనస్సు నిలబడి, సమాధి స్థితిలోకి వెళ్ళగలడు. హృదయాకాశామున చిరకాలము సులగ్నమొనర్చుట చేతను, వాసనారహితుడై, ఆత్మధ్యానము చేయుట  చేతను, ప్రాణస్పందము నిరోధింపబడును. (దీన్నేహృదయధ్యానమంటారు.)

యోగశిఖోపనిషత్:తృతీయాధ్యాయము:
       
సిద్ధులకు కారణమైన చిత్తు యోగమని చెప్పబడినది.  ఏది తెలిసినంతనే జన్మయనెడి  బంధమును వీడి ముక్తుడగునో, అక్షరమైన పరమనాదము శబ్దబ్రహ్మమని చెప్పబడును. మూలాధారమును పొందిన శక్తి స్వాదారమైనది, బిందురూపిణియు. దానియందు నాదము సూక్ష్మబీజమునుండి అంకురము వలె పుట్టును. దేనిచే యోగులు విశ్వమును చూచెదరొ దానిని 'పశ్యంతీ ' అనెదరు. హృదయమందు మేఘగర్జన వంటి శబ్దము స్పష్టమగును. దానికి 'మధ్యమ' అని పేరు. స్వరమను ప్రాణముచే 'వైఖరి' ప్రసిద్ధమైనది. తాలువు మున్నగు స్థానముల
యెత్తి
డిచే, శాఖాపల్లవరూపమున అకారాది క్షకారాంత అక్షరములు పుట్టును. అక్షరముల నుండి పదములు, పదములనుంది వాక్యములు పుట్టును.  మంత్రములు వేదశాస్త్రములన్నియూ పూర్తిగా వాక్యాత్మకములు.  పురాణములు, కావ్యములు, వివిధ భాషలు అన్నియూ వాక్యాత్మకములే! సప్త స్వరములు, గాధలు అన్నియూ నాదము వలన పుట్టినవే! ఆ సరస్వతీదేవి సర్వభూతముల యొక్క గుహను (నోటిని, హృదయమును) ఆశ్రయించినది. వహ్నియుక్తమైన వాయువుచే మెల్లమెల్లగా ప్రేరేపింపబడినదై దాని వివర్తమైన (మారిన) పదములతో ఈరీతిగా నుండును. ఏ యోగి ఈ వైఖరీ శక్తిని స్వాత్మయందు చూచునొ, అతడు సరస్వతీ ప్రసాదమున వాక్సిద్ధిని పొందును. స్వయముగా వేదశాస్త్రములకు కర్త యగును. బిందువు, నాదము, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, అన్ని యింద్రియ ములు ఎక్కడ లయమగునో, వాయువులు, మనస్సు ఎక్కడ లీనమగునొ, దేనిని పొందిన వాడు ఇంతకన్నా ఎక్కువ లాభముగా దేనిని ఆనుకొనడో, దేని యందుండి, పెద్ద దుఃఖముచే కూడా చలింపడో (వీటికి ఉదాహరణ: ప్రహ్లాదుడు, అంబరీషుడు), యోగసేవచే నిరోధింపబడిన చిత్తము ఎక్కడ విశ్రాంతిని పొందునో, ఎక్కడ ఆత్మచే ఆత్మను చూచుచూ, ఆత్మయందే సంతోషించునో, ఏది బుద్ధిగ్రాహ్యము, అతీంద్రియమునైన అత్యంతిక సుఖమో, య్యది క్షరాక్షరాతీతము, అనక్షరము అని చెప్పబడును. సర్వభూతములు క్షరములు. సూత్రాత్మ అక్షరుడు. 

షష్ఠోధ్యాయము:
       
మనస్సుచే మనస్సును చూసి యోగవేత్త ముక్తుడగును.  మనస్సుచే మనస్సును చూచి, ఉన్మన్యంతము ఎప్పుడునూ స్మరించవలెను. మనస్సుచే మనస్సును చూచి, ఎప్పుడునూ యోగనిష్ఠుడు కావలెను. అట్లే దశ ప్రత్యయములు చూడవలెను. ప్రత్యయము లెప్పుడు కనపడునో, అప్పుడు యోగీశ్వరుడగును. బిందువు నాదకలాజ్యోతి. (దీనినే 'తేజబిందోపనిషత్'లో 'నాదాంత జ్యోతిరేవసః" నాదము యొక్క అంతమందు జ్యోతి మాత్రమే మిగులును అని చెప్పారు.) ఆ బిందువు ధృవతారకమైనది. అది శాంతము, అతీతము, పరబ్రహ్మ అని చెప్పబడును. (అట్టి యోగి) నవ్వును. ప్రీతిచే ఉల్లాసముగా నుండును. (ఆత్మలో) క్రీడించును. సంతోషించును. బుద్ధిచే జీవనమును విస్తరించును. అంతట భయము వలన భయపడును. అడ్డగించును. తెలిసికొనును. శోకమువలన మొహమునందును. సంపదచే కాదు. శత్రుకార్యములందు కంపించును. (విదేహముక్తి కొరకై ప్రాణోత్క్రమణ)కోరికచే నవ్వుచూ క్రీడించును. కామరహితమైన చిత్తమును స్మరించి కళేబరమున తెలియవలెను. వాయువెక్కడ ఉండునో, చిత్తమక్కడే ఉండును. (ఇందుకోసమే పూరక, కుంభక, రేచక పూర్వకమైన ప్రాణాయామాన్ని నిర్దేశించారు.) ఎల్లప్పుడూ నాదానుసంధానమున వాసన క్షీణించును. (శ్రీత్యాగరాజుగారు "నాదతనుమనిశం" అని ఇందుకే కీర్తించారు.) వాయువు నిరంజనమైన మనస్సునందు లీనమగును. నాదమేదో అదే బిందువు. అదే చిత్తము. నాదబిందు చిత్తముల కైక్యము సాదిమ్చావలెను. మనస్సు, బిందువును ఉత్పత్తికి, స్థితికి కారణములు. మనస్సుచే బిందువు పాలచే నెయ్యివలె పుట్టుచున్నది. షట్చక్రముల నెరిగినతర్వాత సుఖమండలము ప్రవేశింపవలెను. [సాధారణముగా అందరూ
షట్చక్రములతో ఆఖరు, అంటే సహస్రారమే చివరిది అని అనుకుంటున్నారు. ఉపనిషత్తు లోని ఈ వాక్యముననుసరించి ఆ తర్వాత కూడా స్థాయీలు ఉన్నాయి అని తెలుస్తోంది. రహస్యమైనా ఇక్కడ చెప్పక తప్పదు. సద్గురువులు పోడూరి కృష్ణవేణుమాతాజీ గారు, అనుభవ పూర్వకముగా సహస్రారము తర్వాత ఇంకనూ  ఆరు స్థాయీలు కలవని, అందులో మొదటి మూడు ఈ శరీరము ఉండగా అనుభవములోనికి వచ్చునని, మిగిలిన మూడు ఈ భౌతికశరీరము వదిలిన తర్వాత మాత్రమే ప్రవేశింప  గలమని చెప్పేవారు. ఈ విషయమై మేము  శ్రీగురుమండలిని క్షమాపణ కోరుతున్నాము. ఎందుకంటే ఈ విషయం చెప్పవచ్చో, చెప్పకూడదో, మాకు తెలియదు. మేము ఈ కార్యక్రమాన్ని (తత్వవిశ్లేషణ  అనే వెబ్సైట్ ని నిర్వహించడం) వారి ప్రోద్బలంతోనే చేస్తున్నాము. నిజానికి మాకు ఇవేమియూ తెలియవు] వాయువు నాకర్షించి ప్రవేశించవలెను. అట్లే పైకిన్నీ నియోగించవలెను. వాయువును, బిందువును, చక్రమును, చిత్తమును అభ్యసింపవలయును. సమాధిని, (దానితో) సమముగా అమృతమును యోగులు పొందుదురు. కర్రమధ్యలోనున్న నిప్పు మధించ కుండా పైకి రానటుల అభ్యాసయోగము లేనిదే జ్ఞానదీపము రాదు. దీపము ఘటమధ్యమునందే గాని, బాహ్య ప్రదేశమున వెలగనట్లు, ఘటము భిన్నమైననూ, దీపము ప్రకాశించుచున్నటుల, స్వశిరము ఘటము. జీవుడు తత్పదార్థము. గురువాక్యము సమముగా భిన్నమైన (విశ్లేషింపబడిన)బ్రహ్మజ్ఞానము ప్రకాశించును. గురువును కర్ణదారునిగా (చుక్కాని పట్టువానిగా) పొంది, ఆ గురువాక్యమును తెప్పగా దృఢముగా పొంది, అభ్యసవాసనాశక్తిచే యోగులు భవమనెడి సాగరమును తరింతురు.
              యోగాయుక్తుడైన యోగికి దీపజ్వాల, చంద్రుడు, ఖ్యదోతములు(ఆకాశములో వెలుగుతూ కనిపించేవి), మెరుపు, నక్షత్రములు సూక్ష్మరూపమున ఎప్పుడునూ కనిపించును (ఇవి అన్నియూ నాదబిందువుయొక్క తేజోరూపాలు). అణిమాదికమైన ఐశ్వర్యమతనికి అచిర కాలముననే కల్గును.  నాదముకన్నా గొప్ప మంత్రము లేదు. స్వాత్మకన్నా పరుడైన దేవుడు లేదు. ('దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతనః' దీనికి సరియైన అర్థం ఇదియే. ఎందుకంటే, త్రాడుకి పైకొస పరమాత్మ ఐతే, క్రిందికోస ఆత్మ. ఈ క్రింది కొస అయిన ఆత్మను పట్టుకుంటే గాని, పైకొస అయిన పరమాత్మ దొరకడు. అటువంటి ఆత్మ మనలోనే వుంది. కాబట్టి మనలోనే ఉన్నదాన్ని వదిలివేసి, ఆ పరమాత్మకోసం బయట ఎక్కడెక్కడో తిరిగితే, మునిగితే, దొరుకుతాడా?). (ఆత్మ పరమాత్మల) అనుసంధానము కన్నా గొప్పదైన పూజ లేదు. తృప్తికన్నా గొప్పదైన సుఖము లేదు. సిద్ధిని కోరువానిచే సర్వదా నిది గోపనీయము. నాభక్తుడు దీని నెరిగి, కృతకృత్యుడై సుఖవంతుడగును. ఎవనికి దేవుని యందెక్కువ భక్తి కలదో, దేవునియందు వలెనే, గురువుయందు భక్తి కలదో, ఆ మహాత్మునకు చెప్పబడినచో, ఈ విషయములు ప్రకాశించును.

పైంగలోపనిషత్:
తృతీయాధ్యాయము:
             హృదయములో ధూమరహిత, కలశాంతరదీపము రీతిగా ప్రకాశించు అంగుష్ఠమాత్రాత్మను ధ్యానము చేయవలెను. తనలో ప్రకాశించు చున్న కూటస్థ అవ్యయ పరమాత్మను నిరంతరము, జీవితకాలమునంతయూ ధ్యానము చేయుచుండవలయును. (ఈ వాక్యాన్ని బట్టి, ధ్యానము, యోగము పూర్తిగా ఒక జీవితకాల, నిరంతర (perpetual) ప్రక్రియ అని అర్థమవుతోంది. ఒకరోజులో కొన్ని నిముషాలో, నెలలో కొన్ని రోజులో, సంవత్సరములో కొన్ని నెలలో, జీవితంలో  కొన్ని సంవత్సరాలో చేసేది కాదు. పరమార్ధ జ్ఞానం తెలుసుకోన్నప్పటినుండి, ఈ శరీరం పడిపోయే వరకూ మన శ్వాసతోపాటు ధ్యానము, యోగము కూడా కొనసాగ వలసినదే. ఇది ఎలా అన్నది సద్గురువులు చెపుతారు. జనకమహారాజు, అష్టావక్రుడు వంటి వారు ఎందరో దీనికి ఉదాహరణలుగా వున్నారు.) అట్టి ముని జీవించి వున్ననూ, జీవన్ముక్తుదై యున్నందువలన, ధన్యుడు. కృతార్థుడు. (ధన్యత, కృతార్థత అంటే ఇది). ఆట్టివాని శరీరము కాలసాత్ కృతమై ఉన్నందున, (ఇంకనూ జీవితకాలమున్నందున జీవించి, తదనంతరము) ప్రాప్తించిన జీవన్ముక్తపదవిని త్యజించి, చలనరహిత వాయువువలె నాతడు విదేహముక్తిని పొందును. ఆశబ్దము, అస్పర్శము, అరూపము, అవ్యయము, అరసము, అగంధము, అనాది, అనంతము, అమలము, నిత్యమూ, మహాత్వారము, నిరామయమగు సత్యపదార్థమొక్కటియే మిగిలియుండును.

  (మీ స్పందనల కోసం ఎదురు చూస్తూ వుంటాము,
www.tatvavisleshana.weebly.com ని దర్శించండి.)                       

No comments:

Post a Comment