Saturday, November 26, 2011

తత్వ విచారణ

తత్వ విచారణ


             శుద్ధగంభీరనిరాకారపరమాత్మ స్వరూపాన్ని భావించుటకు, తెలుసుకొనుటకు, జన్మజరా మృత్యు చక్రమునుండి బయటపడి ఆపరమాత్మ స్వరూపముతో  మమైక్యముచెంది మహాపరినిర్వాణము పొందుటకు చేసే ప్రయాణములో "తత్వ విచారణ" అత్యంత ప్రముఖమైనది. మనం తెలుసుకోనగోరే దానిని సందేహముతో మొదలుపెట్టి జవాబును తెలుసుకొని దానిని పొందుటకు ప్రయత్నించాలి.  మనకు కావలసిన దానియొక్క ఆవిర్భావాన్ని, మూలాన్ని, ఆధారాన్ని, సూటిగా ప్రశ్నించాలి.  గజేంద్రుడు అడిగినట్లు,"ఎవ్వనిచే జనించు? జగమెవ్వని లోపలనుండు లీనమై? ఎవ్వనియందుడిందు? పరమేశ్వరుడెవ్వడు? మూల కారణం  బెవ్వడు? అనాదిమధ్యలయుండెవ్వడు? సర్వము తానైన వాడెవ్వడు?" అని ప్రశ్నించుకొని వాటికి జవాబులు రాబట్టు కోవడానికి ప్రయత్నించాలి.  యోగ వాషిష్టం ఉత్పత్తి ప్రకరణం లో ఇలా చెప్పారు:


"యత్నో యత్నేన కర్తవ్యో మోక్షార్ద్ధం యుక్తి పూర్వకమ్,
యత్నయుక్తి విహీనస్య గోష్పదం దుస్తరం భవేత్"

         
         "మోక్షము కొరకై యుక్తిపూర్వక ప్రయత్నముచే పుర్వపూర్వ సాధనలుసిద్ధింప, ఉతరోత్తర సాధనల యందు మరల యుక్తి పూర్వకముగ ప్రయత్నమాచరింప వలెను.  ప్రయత్నమూ, యుక్తి లేని వారికి గోవు పాదమంత స్టలమున్ను దాటనశక్తమై యుండును."  దీనిని నిశితముగా పరిశీలించినచో, మోక్షము కొరకై మొదట చేసిన ప్రయత్నములు సిద్ధించిన తర్వాత దానితో తృప్తి చెందక తదుపరి సాధనకై ప్రయాత్నము చేయవలెను. దానిని యుక్తి పూర్వకముగా చేయవలెను.  అట్లు చేయలేనిచో గోవు పాదమంత స్థలము కూడా దాటనశక్తుడై యుండును.  ఈవిధంగా మనము ప్రతి స్థాయిలో తత్వ విచారాన్ని యుక్తి పూర్వకముగా కొనసాగించాలి.  అదే  యోగ వాషిష్టం నిర్వాణ ప్రకరణంలో శ్రీవశిష్టులవారు ఈవిధంగా తెలియజేసారు:  


"స్వయమేవ విచారేణ, విచార్యాత్మానమాత్మనా, 
యావన్నాధిగతం జ్ఞేయం, నతావధి గమ్యతే"

           "ఎంతవరకు మనుజుడు విచారణ ద్వారా జ్ఞేయ వస్తువగు ఆత్మను తాను స్వయముగా విచారించి ఎరుగకుండునో, అంతవరకు నద్దాని నాతడు పొందజాలకయే యుండును."  దీనిని బట్టి మానవుడు తనంత తానే విచారణ చేసి, తెలిసికొనదగిన వస్తువును తెలుసుకొనవలెను గాని, యితర మార్గములు లేవు యని రుజువగుచున్నది.  మరియు అదే ప్రకరణములో:


"అస్మిన్సంసార సంరంభే జాతానం దేహ ధారిణం,
అపవర్గ క్షమౌ రామ ద్వావిమా ఉత్తమౌ క్రమౌ

ఎకస్థావద్గురుప్రోక్తాదనుష్టానా చ్చనై శనై, 
జన్మనాజన్మభిర్వాపి సిద్ధిదః సముదాహృతః
ద్వితీయ స్త్వాత్మ నైవాశు కించి ద్వ్యుత్పన్న చేతసా, 

భవతి జ్ఞానసంప్రాప్తి రాకాస ఫల పాతవత్"     

            "ఓ రామచంద్రా! ఈ ప్రపంచసంరంభమున జనించు జీవులకు చెప్పబోవు రెండు క్రమములున్నూ మోక్షమును కలుగజేయు సమర్ద్ధములై యున్నవి. అందొకటి  గురూపదిష్టమగు అనుష్టానమును మెల్లమెల్లగా సాధిన్చుచూ రాగా, ఈ జన్మలోనో లేక కొన్ని జన్మలందు గాని మోక్షమును కలుగజేయునది యని చెప్పబడినది.  ఒకింత పరిపక్వమైన చిత్తము కలవారికి తాను గావించు తత్త్వ విచారణచే ఆకాశము నుండి ఫలము పడు చందమున శీఘ్రముగా జ్ఞానము సంప్రాప్తించుట రెండవ క్రమమై యున్నదని," శ్రీ వశిష్టులవారు ఉపదేశించినారు.

                  దీనిని నిశితముగా పరిశీలించగా, శాస్త్ర ప్రోక్తములైన గురూపదేశ సంప్రాప్త అనుష్టానముల కన్నా, స్వయముగా చేయు తత్త్వ విచారణకే అధిక ప్రాధాన్యత నీయ బడినది.  తాను స్వయముగా విచారించి తెలుసుకోన్నదే బలీయంగా నాటుకొంటుందిదానిపైనే ధృఢమైన ఏకాగ్రత కుదురుతుంది.  ఒకవేళ యిట్టి అవగాహనకు రాలేక పోతే గురువు భాధ్యత వహించి ఈ ఆలోచనకు శిష్యుని ప్రేరేపించాలి.  తత్త్వ విచారాన్ని రేకెత్తించాలి.  ఎప్పుడో పురాణాల్లో వున్న, అమృతం కోసం జరిగిన 'క్షీరసాగర మధనాన్ని' మన మనస్సుల్లో జరపాలి.  ఆ మధనంలోంచే అమృతతుల్యమైన "నిరాకార స్వరూపాన్ని" భావించ గలుగుతాము.

             తత్త్వ విచారమనేది ఆధ్యాత్మిక విద్యకు మూలస్తంభం.  ఇది పరమాత్మ అన్వేషణలో గల అన్ని స్థాయిలలోను అవుసర
పడుతుంది.  బీజగణితంలో మూల సూత్రమైన + మరియు - ల యొక్క సంబంధం ప్రతిచోట అవుసరమైనట్లు, ఈ తత్త్వ విచారణ కూడా ప్రతి స్థాయిలోనూ అవుసరమౌతుంది.  పైపై స్థాయిలకు వెళ్ళేకొద్దీ తత్త్వ విచారణ అత్యంత సునిశితము, సుక్శ్మమూ అవుతూ, ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా మనలను అపప్రదల వైపు అజ్ఞానం వైపు పడవేస్తూ, అసలైన త్రోవనుండి తప్పించి వేస్తూ ఉంటుంది.   దీనియొక్క ప్రాధాన్యత గమనించి బుధులు, ద్రష్టలు అవుసరం ఉన్నా లేకపోయినా చాలచోట్ల దీనిగురించి చెప్పారు. 

             ఇంకా చెపాలంటే "ఉత్తమం  తత్త్వ
చింతనం" అన్నారు. ఈ తత్త్వ విచారణ మనలను చాలా దగ్గర దారిలో పరమాత్మ వద్దకు తీసుకొని పోతుంది.  ఈ తత్త్వ విచారాన్ని ఉపయోగించి గజేంద్రుడు 'ఎవ్వనిచే జనించు' అని మొదలుపెట్టి, 'లోకంబులు లోకేశులు, లోకస్తులు తెగినతుది' అని తెలుసుకొని, 'జిత్రచారునికి, సాక్షికి, నాత్మరుచికిని' అని విచారము చేసి 'నిఖిల కారణునకు, నిష్కారుణునకు నమస్కరింతు' అని, 'విశ్వకరు, విశ్వదూరిని', 'శాశ్వతు, నజు భజయింతున్' అని 'నీవె తప ఇతః పరంబెరుంగ' అని స్వాత్మ సమర్పణ చేసుకొని, ఆ పరమాత్మని పొందాడు.  అలా తత్త్వ విచారణ చేసిన గజేన్ద్రుడుని కాపాడటానికి వెంటనే పరుగు పరుగున 'సిరికిన్ చెప్పక, శంఖు చక్రమున్ చేదోయి సంధింపక' ఆ పరమాత్మ వచ్చాడు.  తత్వావిచారణయొక్క సద్యోఫలితమిదే.  యోగ వాషిష్టంలో కర్కటికోపాఖ్యనంలో కర్కటి రాక్షసి మొదట పదివేల ఏళ్ళు తపస్సు చేసి బ్రహ్మని ప్రత్యక్షం చేసుకుంటుంది.  ఆ తర్వాత మళ్లీ బ్రహ్మ అవుసరం పడి, ఒక నిమేష మాత్రం తత్త్వ విచారణ చేసి ఆ బ్రహ్మ యొక్క సాక్షాత్కారం పొందుతుంది.  ఇదే తత్త్వ విచారణలో ఉన్న గమ్మత్తు.  మదానికి, తమస్సుకి, అజ్ఞాన పరాకాష్టకి ప్రతినిధి అయిన  ఒక జంతువు, ఏనుగు, తత్వ విచారాన్ని చేసి, పరమాత్మని పొందగా, మనస్సు, బుద్ధి, చైతన్యము, యుక్తాయుక్త విచక్షణాజ్ఞానము గల మనం ఆ పరమాత్మని పొందలేమా?  ఎవరికీ వారే ఈ ప్రశ్నని వేసుకోండి! ఇంతటి మహోన్నతమైన ఫలితాలని అందించే తత్త్వ విచారణ గురించి ఆలోచించి, తెలుసుకోండి.

ఆ గజేంద్రుడు ఏవిధంగా తత్త్వ విచారణ చేసాడో, మళ్లీ మనం కలుసుకున్నపుడు తెలుసుకుందాము.
          

దీనిపై మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయ ప్రార్ధన.

"హరి: ఓం"

(Please visit: www.tatvavisleshana.weebly.com)

 

       


Friday, November 25, 2011

తత్వ విశ్లేషణ :

ఆధ్యాత్మిక తత్వ విచారణకు ప్రాచుర్యం కల్పించి, జ్ఞాన సముపార్జన వేగవంతం చెయ్యాలని మా ఆకాంక్ష. దీని వలన ఆధ్యాత్మిక జ్ఞానలోతులకు వెళ్లి ఆ రహస్యాలను తెలుసుకుని, ఆ అనుభవాలను పొంది, వాటిని అందరితోను పంచుకోవాలనే మా ప్రయత్నం. ఈ మా ప్రయత్నంలో అందరు సహకరించ ప్రార్ధన. 

దీనికి ఆ గురు పరంపర యొక్క ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నాము. 

(Please visit: www.tatvavisleshana.weebly.com)