Thursday, July 5, 2012

జ్ఞానభూమికలు

                                         జ్ఞాన  భూమికలు              మనం శుభ అహంకారాల గురించి తెలుసుకొన్న తర్వాత వివిధ జ్ఞాన భూమికల గురించి తెలుసుకుందాము. వీటి గురించి ఉపనిషత్తులలోను ఇంకా ఇతర గ్రంధాలలో ఏవిధంగా చెప్పారో తెలుసుకుందాము. కొన్ని వివరణలు బ్రాకెట్లలో ఇవ్వడమైనది.
పైంగలోపనిషత్:పంచమాధ్యాయము:
           
ఋభువు చెప్పుచున్నాడు: అజ్ఞానభూమికలు 7, జ్ఞానభూమికలు 7 వున్నవి. ఈరెండు భూమికల నుండి అన్యములగు అనేకభూమికలు పుట్టుచున్నవి. స్వస్వరూపస్థితిలో నుండు టయే మోక్షము. అహంకారభావనయే తత్చ్యుతి (భ్రంశము). శుద్ధము సత్తా మాత్రము నగు జ్ఞానమే స్వస్వరూపము. స్వస్వరూప స్థితియందెవ్వరు చలింపకయుందురో, వారియందు అజ్ఞత్వముగాని, రాగద్వేషాదిసంకల్పములుగాని, సంభవింపవు. దీనికంటే వేరైన మోహము పూర్వము లేదు, ఇకమీదట నుండబోదు. సంకల్పపరంపరలో మనస్సు ఒక విషయమునుండి మరియొక విషయము పైకి వెళ్ళునపుడు, ఆ రెండు సంకల్పముల మధ్యలో గలుగు స్థితి (మనస్సు లేని స్థితి)యే స్వరూపస్థితి, ఆత్మస్థితి యని చెప్పడును.
(దీనినే మనం ఇంకో రకంగా చెప్పుకొందాము. మనం ఏపనిలో వున్నా, ఏపని చేయకున్నా, మన మనస్సులో ఆలోచనలు భావాలు నిరంతరంగా ఒకదాని వెంట ఒకటి వస్తూ వుంటాయి. అల్లా వచ్చే ఆలోచనల, భావాల మధ్యలో అంటే ఒకభావం వెళ్ళిపోతూ ఇంకొకభావము వచ్చే మధ్యలో ఏదైతే ఎటువంటిఆలోచన భావము లేని స్థితి వుంటుందో దానిని బాగా గమనించండి. ఇంకా బాగా చెప్పాలంటే, మూవీ ఫిల్ము లో ఒకసెకనుకి 24 ఫ్రేములు వుంటాయి. రెండుఫ్రేముల మధ్యలో దృశ్యములేనిభాగము  ఒక సన్నని గీతలాగా వుంటుంది. దాన్ని గమనించండి. ఇప్పుడు బాగా అర్థమైనదని తలుస్తాను. ఇప్పుడు ఆ దృశ్యము లేని భాగాన్ని, ఆలోచన, భావము లేని భాగాన్ని మనం ధ్యానం ద్వారా పెంచుకోవాలి. వెళ్ళిపోతున్న ఆలోచనని, భావాన్ని వెళ్ళిపోనిచ్చి, వచ్చే ఆలోచనని, భావాన్ని రాకుండా ఆపాలి. ఆ ఏమిలేని స్థితిని ఎంతవరకూ వీలైతే అంతవరకూ పొడిగించుకోవాలి. మనస్సుచేసే పని ఆలోచన. ఎప్పుడైతే పైనచెప్పిన విధానంతో మనం ఆలోచనలను ఆపుచేశామో అప్పుడు మనస్సు పనిచేయడం మానేస్తుంది. అప్పుడు మనస్సు అమనస్సు అవుతుంది. ఇదే అమనస్కయోగం. ఈ విధంగా నిరంతరంగా సమాధి అవస్థలో ఉండటమే స్వస్వరూపస్థితి, అదే సమాధి.)  సమస్తసంకల్పము నశించినదియు, శిలవలె నిశ్చలమైనదియు, జాగ్రత్తు నిద్రకాని స్థితియే స్వరూపస్థితి యనబడును. అది సర్వోత్తమ మగు ఆత్మస్థితి. అహం ప్రవృత్తి తొలగిపోగా, ద్వైతము నశింపగా బేధభావము చిత్తములో రహితము కాగా, జడమగు ఏస్థితి కలదో, అదియే స్వరూపస్థితి యని చెప్పబడును. అనఘా! వీటిని తెలిసికొనిన పిమ్మట తిరిగి మొహపంకమున
మునిగిపోవుటయుండదు. అట్టి 7 రకములుగా నున్నట్టి జ్ఞానభూమికల గురించి వాదిజనులు భిన్నసిద్ధాంతములు చెప్పుచున్నారు.  కాని ఇప్పుడీ చెప్పబోవు  7 భూమికలే నాకు సమ్మత ములుగా నున్నవి. నిశ్చయముగా ఈ భూమికలే శుభప్రదములు.  ఈ 7 భూమికలకు సంబంధించిన జ్ఞానమే యదార్ధజ్ఞానమని మహాత్ములు చెప్పుచున్నారు. కల్ ఈ సప్తభుమికలకు పరముగా నున్న జ్ఞేయవస్తువే మోక్షము. 

         సప్తజ్ఞానభూమికలు 1. శుభేచ్ఛ, 2. విచారణ, 3. తనుమానసి,  4.
సత్త్యాపత్తి  5. అసంశక్తి, 6. పదార్ధభావన, 7. తుర్యగ. ఈ భూమికల నాచరించిన వారికి మోక్షము కలదు. ఆ మోక్షస్థితి యందున్న మనుజుడు మరల దుఃఖమునుపొందడు. ఈ భూమికలను గురించిన నిర్వచ నము ను నీవిప్పుడు శ్రవణము చేయుము. "అయ్యో! నేనెందుకు ఇప్పటివరకు మూఢుడనై పడియుంటిని? ఇకమీదటనైనను శాస్త్రసజ్జన సాంగత్యాదులను ఆచరించి యదార్థజ్ఞానమును తెలిసికొనెదను" అని వచించు వైరాగ్యసహితవాంఛను 'శుభేచ్ఛ' యందురు. (ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. నేను అజ్ఞానములో వున్నానని తెలిసికోవడమే జ్ఞానం పొందడానికి మొదటి మెట్టు. అజ్ఞానంలో వున్నాను అని తెలిసికోన్నవారు ఎవరైనా అలా వూరుకుంటారా? జ్ఞానం కోసం ప్రయత్నంచెయ్యరా? అందువల్ల మనం ఎలా వున్నాము? జ్ఞానంలో వున్నామా అజ్ఞానంలో వున్నామా? 'మన స్థితి' ఏమిటి? అని తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మనమీదే వుంది. అందువల్ల దీనికి ముందర 'మన స్థితి' అని అజ్ఞానం గురించి పరిచయం చెయ్యడం జరిగింది. అలాగా అజ్ఞానం గురించి తెలుసుకొని, దానిలోంచి బయట పడటానికి, జ్ఞానం పొందటానికి మనకు మనం ఇష్టపడటమే,  'శుభేచ్ఛ', శుభకరమైన ఇచ్ఛ.) శాస్త్రసజ్జన సాంగత్యము తోడను, వైరాగ్యాభ్యాసము చేతను ఏర్పడు సదాచారప్రవృత్తి 'ఆత్మ విచారణ' అని పలుక బడును. (ఎప్పుడైతే మనం అజ్ఞానంలో ఉన్నామని తెలుసుకున్నామో ఇక ఊరుకోము కదా. దానినుంచి బయటపడే ప్రయత్నం చేస్తాము. ఆంటే జ్ఞానం ఇచ్చే శాస్త్రాలను చదవడం, వాటిని బాగా తెలుసుకున్న వారితో స్నేహము, సహవాసముచేసి మనకున్న సందేహాలను పోగొట్టుకోవడము, ఇంకా పైపై స్థాయీలలొ వున్న జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఆ స్థితిలో మనం ఉంటున్న ప్రస్తుత పరిస్తితి పై ఒకవిధమైన విరక్తి, వైరాగ్య భావన వస్తుంది. దానిపైన, మనం ఇంకా సాగిమ్చవలసిన ప్రయాణం పైన చాల ఆలోచిస్తాము. ఇదే ఆత్మ విచారణ.)  శుభేచ్ఛ చేతను, జ్ఞానవిచారణల చేతను ఇంద్రియార్థముల యందు ప్రీతి శుష్కించి పోవు స్థితిని 'తనుమానసి' యని చెప్పెదరు. (పైన చెప్పిన విధముగా విచారిన్స్తూ వుంటే యదార్థ స్థితిని గమనించి, మనకున్నది, మనం వుంటున్నది సత్యము నిత్యమూ కాదని తెలిసికొంటాము. ఎప్పుడైతే ఈ స్థాయికి వచ్చామో, అప్పుడు మనకి మన శరీరం పైన, వివిధ శరీర అంగాలు ద్వారా వచ్చే భౌతిక జ్ఞానము, ఆనందాల పట్ల అనురక్తి, ప్రీతి క్రమంగా తగ్గుతూ తదుపరి  పూర్తిగా నశించి పోతాయి. దీనినే 'తనుమానసి' అంటారు.)
            ఈ మూడు భూమికల అభ్యాసముచే చిత్తమందు ఉత్తమవైరాగ్య మేర్పడి, చిత్తము శుద్ధసత్యస్థితిని పొంది, స్వాత్మయందు నిలుకడబొందుట 'సత్త్యాపత్తి' అందురు. (పై తను మానసి స్థాయికి చేరుకున్న తర్వాత, ఈ శరీర
ముకాక సత్యము, నిత్యమైనది మనలో ఏమున్నది? అనే ప్రశ్న వస్తుంది. దానితోపాటే, మనలో వున్న ఆత్మే సత్యమైనది, నిత్యమైనది అనే జవాబు కూడా వస్తుంది. అప్పుడు, దానిపై నిలకడ కుదురుతుంది. ఇక్కడ జరిగే సంఘర్షణ, మనస్సుల్లో జరిగే భావపరంపర కల్లోలముల గురించి మాటల్లో చెప్పలేము. కేవలము అనుభవింప వలసినదే. ఇంత జరిగిన తర్వాత గాని మనకు మన ఆత్మ మీద గురి, నిలకడ కలగదు. సరిగ్గా ఈ స్థితినే, 'సత్యాపత్తి' అంటారు.)  ఈ నాలుగు భూమికల అభ్యాసముచే సత్త్యారూఢస్థితిని పొంది, విషయవాసనారహితమగు అసంగస్థితియందు యుందుంటయే 'అసంసక్తి' యనబడును. (ఈ స్త్యాయికి వచ్చిన తర్వాత క్రమేణా అశాశ్వతమని తెలుసుకున్న వాటన్నింటిపైనా ప్రీతి నశించి, వీటిని పూర్తిగా వదలివైచి వాటితో ఏవిధమైన భౌతికమైన, మానసికమైన సంబంధమూ పెట్టుకోకుండా, వాటికి అంటుకోకుండా వుంటాము. ఇదే 'అసంసక్తి') ఈ అయిదు భూమికల యొక్క భాహ్యాభ్యంతరపదార్థ భావనాశూన్యుడై స్వాత్మ యందు ధృఢమైన స్థితిని అనుభవించుచూ, ఇతరులతో ప్రయత్నపూర్వకముగా అవబోధనము చేయింపబడునట్టి స్థితి 'పదార్థ భావన' యనబడును. (ఈ 5వ స్థాయిని అనుభవించుచూ వుండగా క్రమేణా మనకి మనకు బయట, లోపల వున్న వాటితో సంబంధాలు పూర్తిగా పోయి, ధ్యానములో ఆత్మదర్శనం పొంది, తదుపరి ఆ ఆత్మదర్శనాన్ని పొడిగించుకుంటూ, ధ్యానం లోంచి సమాధిస్థితికి మారుతూ, ఆత్మస్థాయి లోంచి పరమాత్మస్థాయికి మనఆత్మ పరిణితి చెందే కాలములో, మనచుట్టూవున్న కొంతమంది మనలను గమనించి, ఆసక్తితో, మీరేదోచేస్తున్నారు, మాక్కూడా చెప్పండి అని అడుగుతారు. అప్పుడు మనం మనకు ఇష్టం లేనప్పటికీ, తాత్కాలి కంగా పైస్థాయి నుండి కిందకి వచ్చి, మరల ఈ ప్రపంచంతో సంభంధం పెట్టుకుని, ఆ అడిగిన వారికి తగు విధంగా చెప్పి, వారితో కూడా ఈ మార్గాన్ని అవలంభింప చేయడం 'పదార్థ భావన') ఈ 6 భూమికల నిరంతరాభ్యాసము వలన బేధభావము నశించగా, స్వాభావికముగా సంభ వించు ఆత్మనిష్ఠనే 'తుర్యగ' అనిచెప్పెదరు. ఇయ్యదియే తురీయావస్థ. తుర్యగ అనే ఈతురీయా వస్థయే జీవన్ముక్తులకు యుండును. (ఈ విధంగా 6 జ్ఞాన భూమికలను నిరంతరంగా అభ్యాసం చేస్తూవుంటే ఒకానొక స్థాయి వచ్చేసరికి, మన ప్రయత్నం ఏమాత్రం అవుసరం లేకుండా, మన ఇష్టానిష్టాలతో సంభంధంలేకుండా, ఈ ప్రపంచాన్నివదలివేసి, మన ఆత్మ దానంతట అదే సమాధి లోకి వెళ్ళిపోతుంది. మళ్లీ ఇది ముక్తి, మరణం కాదుసుమా! ఇంకా మనకి జీవితకాలం (life- span) మిగిలే ఉంటుంది. కాని మనం ఈ ప్రపంచంతోటి గాని, దాని విధివిధానాల తోటి గాని ఏవిధమైన సంబంధం లేకుండా, కేవలం ఆపరమాత్మ తోటే సంగమిస్తూ వుంటూ, ఇంకా మిగిలి వుంది కాబట్టి, జీవితాన్ని గడుపుతూవుంటాము. దీనినే జీవన్ముక్తదశ అంటారు. దీనినిపొందిన వారిని 'జీవన్ముక్తులు' ఆంటే జీవించి యుండగానే ముక్తిని పొందటానికి అర్హులైనవారు అంటారు. వీరిని గురించి ఇంకొక చోట తెలుసుకుందాము.) ఈ అవస్థకు పైన తురియాతీతావస్థ అనునది విదేహముక్తికి సంబంధించినది. తురీయాతీతమనగా, తురీయ వ్యవహారము గూడ దాటి యున్నదని భావము.  మహాత్ములును, ఆత్మారాములును, మహాధన్యులును, వీనిలొ నెవరు సప్తమభూమికని చేరెదరో, వారే మహత్పదమును, విదేహముక్తిని, పొందిన వారగు    చున్నారు. జీవన్ముక్తులు, సుఖదుఃఖ పరిస్థితులలో మునిగిపోరు. అట్టివారు ప్రాప్తించిన కార్యములను మాత్రమే కొంచెముగా చేయుదురు. లేదా యేమియూ చేయకయుందురు. సత్పురుషులు, ప్రక్కలనున్న వారిచే బాధితులై, నిద్రనుండి లేచిన వారి రీతిగా పూర్వాచార క్రమానుగాతములైన ఆచారములను ఆచరించుచుందురు. ధీమంతులకు మాత్రమే ఈ 7 జ్ఞాన భూమికలు అర్థమగును. జన్మాంతర పుణ్య బలముతో పశువులు, మ్లేచ్ఛులు మున్నగు    జీవులు కుడా ఈ జ్ఞానభూమికలను పొందిన, వారు ముక్తులౌదురు. (దీనికి చాలా చక్కని ఉదాహరణలు వున్నాయి. ఒకానొక సందర్భంలో సంత్ జ్ఞానేశ్వరులవారు చైతన్యభావనతో అన్ని ప్రాణులు ఒక్కటే అని చెపుతారు. అపుడు అక్కడ వున్న దున్నపోతును చూపించి, అది నువ్వు ఒక్కటేనా? అని అడుగుతారు. జ్ఞానేశ్వరులవారు ఒక్కటే అని జవాబు చెపుతారు. ఐతే ఆ దున్నపోతుతో వేదం చెప్పించు అని అడుగుతారు. అప్పుడు  జ్ఞానేశ్వరులవారు ఆ దున్న పోతు తలపై చెయ్యి పెట్టగానే, ఆ దున్నపోతు వేదం చెప్పడం ప్రారంభించిందట. అక్కడనుండి ఆ దున్నపోతు బ్రతికి యున్నంత కాలమూ వేదం చెప్పిందట. దాని సమాధిని ఇప్పటికి పండరి పురములో చూడవచ్చట. ఈవిధంగానే ముక్తిని పొందినటువంటి కాకి, చిలక యొక్క గాధలు తెనాలి రామలింగకవి రచించిన 'శ్రీపాండురంగ మహాత్మ్యము' లో వున్నాయి. శ్రీకాళహస్తిలో, సాలె పురుగు, పాము, ఏనుగు మోక్షం పొందిన విషయం మనకు తెలుసు. గజేంద్ర మోక్షం సంగతి తెలియని వారుండరు.  అలాగే భక్త రామదాసు, ఆయనను ఖైదు చేయించిన తానీషా పూర్వ జన్మలో ఒకే గురువు దగ్గర శిష్యులట. వారు చేసిన కొన్ని కర్మలను బట్టి తదుపరి జన్మలో రామదాసు చిత్రహింసలు, కారాగార వాసము అనుభవింప వలసి వస్తే, తానీషాకు రాజ్యాధికారము, శ్రీరామ దర్శనము కలిగినాయట. దీనిని బట్టి, వేదాలలోను, శ్రుతులలోను, స్మృతులలోను, ఉపనిషత్తులలోను వివరించినవి, సత్యములని, జరిగి తీరుతాయని మనం తెలుసుకోవాలి.)
             ఈ జ్ఞానభూమికలలో సంచరించువారు శరీరసహితులైననూ, శరీరరహితులైననూ, వారు ముక్తులే యగుచున్నారు. ఇందులో సందేహము లేదు. హృదయగ్రంధి విచ్ఛేదమే జ్ఞానము. అట్టి సిద్ధి ప్రాప్తించుటే ముక్తి. గ్రంధి
విచ్ఛేదరూపమగు విముక్తిస్థితి. అనగా మృగ తృష్ణలో జలములున్నట్లు భ్రాంతి రీతిగా మహదాదిస్ఠూలాంత భ్రాంతి, అహమాది దేహాంత భ్రాంతి మున్నగు సర్వభ్రాంతులు నశించునట్టి స్థితి. అజ్ఞాన సాగరమును దాటినవారే పరమ పదమును పొందినట్టివారు. స్వాత్మలాభపరాయణులే ఈ సప్తభూమికలలో నున్న వారలగు చున్నారు. (మనకు తెలిసున్నంతలో ఈ అవస్థలలో  చిరకాలము జీవన్ముక్త దశను అనుభవించి, విదేహముక్తి పొందినవారు అలనాటి కంచి పీఠాధిపతి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి స్వాములవారు.) మనస్సు నశించు ఉపాయమే యోగమని చెప్పబడును.  అట్టి యోగము సప్తభూమికలు కలదిగా తెలియవలెను. అట్టి సప్తభూమికలు విపులముగా వివరింపబడినవి. ఈ సప్త భూమికలకు లక్ష్యము ఆ పరబ్రహ్మపదమే అయివున్నది.
యోగవాసిష్ఠము:నిర్వాణ ప్రకరణము:ఉత్తర భాగము: 120వ సర్గ:
             (పైన చెప్పబడిన సప్తవిధ జ్ఞానభూమికలనే శ్రీవశిష్ఠులవారు శ్రీరామచంద్రునకు వేరొక విధముగా తెలియజేసినారు.) శాస్త్రాభ్యాస సజ్జన సహవాసముచే మొదట 'ప్రజ్ఞ'ను వృద్ధి పరచ వలెను. ఇది యోగము యొక్కయు, యోగి యొక్కయు మొదటి భూమికయని చెప్పబడినది. ఇక రెండవ భూమిక 'విచారణ'. మూడవది 'అసంగ భావన'. నాల్గవది వాసనల కాశ్రయభూత మగు అవిద్య లయించునట్టి 'విలాపనీ' అవస్థ. సుద్ధచిన్మాత్ర సంవిత్తుచే పూర్ణమై, ఆనందరూప మైనది యైదవభూమిక. జీవన్ముక్తుదగు యోగి ఈ భూమికయందర్థనిద్రితుని వలెను, అర్థ జాగ్రతునివలె నుండును. స్వభావముగానే నిరతి శయానందమయమై, బ్రహ్మాకారానుభావ నివృత్తిరూపమై సుషుప్తివోలె నున్నట్టి స్థితి యారవ భూమిక. అట్టి వృత్తి యున్ను క్షయించి, శమించిన తురీయావస్థ కలదై, కేవలము ముక్తిరూపమై, శమమై, స్వచ్ఛమై సౌమ్యమైనట్టి స్థితి, ఏడవ భూమిక, తురీయాతీతావస్థ యగును. ఇట్లు
తురీయాతీతావస్థ పరానిర్వాన రూపమై యున్నది.  ఈ సప్తమ భూమికయే మిగుల ప్రౌఢమయినచో, విదేహముక్తి లభించును. అది జీవించియుండు యోగులకు విషయము కాదు.
             ఇందు మొదటి మూడవస్థలూ జాగ్రద్రూపములై  యుండును. (ఆంటే మనం ఈ అవస్థ లను జాగ్రదావస్థలోనే అనుభవిస్తాము. నాల్గవది స్వప్నరూపమని పేర్కొనబడినది. అందీ జగత్తు స్వప్నరూపముగా భాసించును. (ఈ అవస్థలో మనం ఈప్రకృతి అశాశ్వతమని తెలుసు కొని, ఇందులో మన జీవితాన్ని స్వప్నంలాగా తలుస్తాము.) ఆనంద ఘనమగు ఆత్మతో ఏకీభావము నొందుటచే నైదవ భూమిక సుషుప్తిరూపమని చెప్పబడినది. (ఇది ఆత్మదర్శనం అయిన తర్వాత ఆంటే ధ్యానంలో, మొట్టమొదటి సారిగా, పెంజీకటి మధ్యలో క్షణకాలం మిణుగురుపురుగు లాగ దర్శనం ఇచ్చిన ఆత్మను, ఆ ధ్యానస్థితిని ఇంకా పటిష్టపరచుకుంటూ, వెలుగుతూ ఆరిపొతూ ఉన్నదానిని నిశ్చలం చేసుకొని, ఆ తేజస్సును మిణుగురు పురుగు పరిమాణం నుండి, చంద్రమండల పరిమాణం లోనికి తెచ్చుకుంటూ, ధ్యానస్థితి నుండి సమాధి స్థితికి పరిణామం చెందుతూ, ఆనందం అనుభవించే అవస్థ. ఇక్కడే మనకి స్వస్వరూప జ్ఞానం పూర్తిగాతెలిసి అర్థమవుతుంది. ఇది నిజానికి సుషుప్తి కాకుండా, దానికి పైనున్న అవస్థ అయినప్పటికీ, మనకి తెలియడంకోసం సుషుప్తి అని చెప్పారు.) ఇతర పదార్థముల జ్ఞానములేక కేవలము స్వరూపమాత్రమందలి స్థితి గల్గియున్నదగుటచే ఆరవది తురీయపదమని వచింపబడినది. తురీయాతీత పదావస్థ యుత్తమమైన ఏడవభూమిక యగుచున్నది. ఇది స్వప్రకాశ రూప మగుటచే మనోవాక్కుల కగ్రాహ్యమై పరగుచున్నది. అంతరంగమున సమస్తము లయించుటచే విషయమేమియూ భాసింప కుండునట్టి యా సప్తమ భూమికా రూప మహా సమత్వముచే యోగి ముక్తుడే యగును. ఇందు సందేహమేమియూ లేదు.  

                           (Please visit www.tatvavisleshana.weebly.com)

No comments:

Post a Comment