Sunday, July 8, 2012

జ్ఞానము - యోగము

                          జ్ఞానము - యోగము 

            ఇంతవరకూ మనం అజ్ఞానం గురించి, అవస్థల గురించి, శుభఅహంకారాల గురించి, జ్ఞానం మరియు అందులో వున్న వివిధ భూమికల గురించి తెలుసుకున్నాము. జ్ఞానము (knowledge) వివిధవిషయాలగురించి చెపుతుంది. విషయాలగురించి తెలుసుకోవడం అనుభవం అవదు. దాన్నికేవలం అనుభవించ వలసినదే (practical). సైన్సు పుస్తకములో విషయాలని చదువుతాము. దానివల్ల విషయాలు తెలుస్తాయిగాని పూర్తిగా బోధపడవు. పూర్తిగా అర్థమవ్వాలంటే ఆ ప్రయోగం చెయ్యాల్సిందే. అలాగే, విషయాన్ని తెలుసుకోకుండా ఉత్తి ప్రయోగం చేస్తే కూడా విషయం పూర్తిగా అర్థమవదు. కాబట్టి మొదట విషయాన్ని తెలుసుకొని, దాన్ని ప్రయోగం చేసి, ఆ అనుభవం ద్వారా విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. జ్ఞానము, యోగమువిషయంలో కూడా సరిగ్గాఅంతే. జ్ఞానముద్వారా తెలుసుకొన్న విషయాలని, యోగము ద్వారా అనుభవించి పూర్తిగా తెలుసుకోవాలి. కొంతమంది జ్ఞానము ఒక్కటే చాలు అని యోగాన్ని వద్దని నిర్లక్ష్యం చేస్తారు. కొంతమంది యోగం ఒక్కటే ఆచరిస్తే చాలు, ఇంకేమి అక్కరలేదు అనుకొంటారు. కేవల జ్ఞానం వల్ల అనుభవం రాదు. కేవలం యోగం ఒక్కటే చేసి నందువల్ల, దానివల్ల మనం పొందినదేమిటో అర్థం కాదు. కాబట్టి జ్ఞానాన్ని, యోగాన్ని రెండింటినీ సంయమనం చేసుకొని ఆ అనుభవం ద్వారా మనలను పక్వానికి తెచ్చుకోవాలి. ఇక్కడ మనం ఇంకొక ఉదాహరణ చెప్పుకోక తప్పదు. మామిడి కాయను చూడండి. అది ఆకుపచ్చగా, గట్టిగా, పులుపుగా వుంటుంది. మామిడి పండైతే, పసుపురంగుతో, కాయకన్నా కొద్దిగా మెత్తగా, ఒకరకమైన సువాసనతో, తీపిగా వుంటుంది. ఈ గుణాలన్నీ స్వభావ సిద్ధంగా పండిన పండుకువుంటాయి. అదే కార్బైడ్ వేసి పండిస్తే, కాయ పసుపు రంగులోకి మారుతుంది కాని, ఆ పండు వాసన, తీపి రుచి వుండవు. తేడా అర్థమయ్యింది కదా! జ్ఞానంతో పక్వానికి వచ్చిన మనస్సు, యోగమనే ప్రక్రియతో, అనుభవమనే రంగు, రుచి, వాసన పొంది పక్వానికి వస్తుంది. ఈ రెండిటిలో ఏది లేకపోయినా, ఏది తక్కువైనా, సరిగ్గా పండదు. ఆంటే సరియైన జ్ఞానంతో, తగినటువంటి అనుభవం పొందితేనేగాని, పరబ్రహ్మ తత్త్వము అర్థమవ్వదు. కాబట్టి మనకు పరబ్రహ్మ తత్త్వము పూర్తిగా అర్ధమవ్వాలంటే జ్ఞానము, యోగము రెండూ కావలసిందే. ఏ ఒక్కటి తనంత తానుగా మోక్షము వైపు మనలను తీసుకొనిపోజాలదు. కాబట్టి ఈవిషయమై, సనాతనులు, ద్రష్టలు, జ్ఞానులు ఏమి చెప్పారో తెలుసుకోందాము. మొదట జ్ఞానానికి యోగానికి గల సంబంధం గురించి తెలుసుకొని, ఆ తర్వాత యోగం గురించి తెలుసుకొందాము.

యోగశిఖోపనిషత్:  (శంకరుడు బ్రహ్మతో చెప్పుచున్నాడు):

       పరమపదమైన మోక్షమునకు కొందరు జ్ఞానముకారణమందురు. కాని అది కేవలము సిద్ధి నియ్యజాలదు. యోగము లేని జ్ఞానము మోక్షమునెట్లిచ్చునయ్యా? యోగముకూడా జ్ఞానము లేకుండా మోక్షము నీయజాలదు. కావున మోక్షముకోరువాడు జ్ఞానమును, యోగమును దృఢముగా అభ్యసింప వలెను. యోగముకొరకే సాధనమైన జ్ఞానము యొక్కస్వరూపమేదో ముందు తెలియవలెను. అజ్ఞానమననేమి? అనికూడా ముముక్షువు తెలిసికోనవలెను. (చూశారా జ్ఞానము యోగము కొరకు ఒక సాధనమని చెప్పారు. జ్ఞానాన్ని బాగా తెలుసుకో మన్నారు. అంతకు ముందు అజ్ఞానాన్ని కూడా తెలుసుకోమన్నారు. కాబట్టి మనం ఇంతకు ముందు అదే వరుసలో, మొదట అజ్ఞానం గురించి, తర్వాత జ్ఞానం గురించి తెలుసుకొన్నాము. మోక్షము కోసం జ్ఞానము మరియు యోగము యొక్క ఆవశ్యకత గురించి, ఆతర్వాత యోగం గురించి తెలుసుకుంటున్నాము.) దానితో పరమపదమైన కైవల్యము యొక్క నిజరూపము తెలియును.  సర్వ దోషములతో చుట్టుకొనబడిన జీవుడు ఆ కామక్రోధాది దోషముచే వినిర్ముక్తుడు, జ్ఞానముచే నెట్లగును? (ఇక్కడ అరిషడ్వర్గముచే చుట్టుకొనబడిన జీవుడు జ్ఞానముచేఎలా విడిపింపబడతాడు? అని అడుగుచున్నారు. దానికిజవాబు కూడఇస్తున్నారు.) స్వాత్మరూపము వలె జ్ఞానమునూ పూర్ణమైనది. వ్యాపకమైనది యును. కామక్రోధాది దోషము లకు నిజముగా స్వరూపమున బేధము లేదు. దానికి విధి ఏమి? తర్వాత దాని నిషేధమేమి? ఎట్లగును? అనగా, వివేకి ఎప్పుదునూ ముక్తుడే! సంసార భ్రమనుండి తప్పుకున్నవాడే! అది పరిపూర్ణమైనది. సత్యిఅమైనది. పూర్ణము కనుక సకలము, నిష్కళమునదే. కలిచే స్ఫూర్తి పొందినదగుటచే, సంసార భ్రమలలో తిరుగుచున్నది. నిష్కళము, నిర్మలము, సాక్షాత్తు సకలము, ఆకాశము వంటిది. ఉత్పత్తి, స్థితి, సంహారముల యొక్క స్ఫూర్తి జ్ఞానము లేనిది. అట్టిది ఈ రూపము పొందినదై ఎట్లు మోహసాగరమున పడుచున్నది? విద్యను వదిలి మాటి మాటికి సంసారమున పడుచున్నది. సంసారులెట్లు సుఖదుఃఖాది మొహములందుందురో, అట్లే జ్ఞాని వాసనావాసితుడై యుండును. వారిద్దరికినీ విశేషములేదు. సంసారభావన ఇద్దరికిని సమమే. ఇట్టి జ్ఞానము తెలియబడినచో, అజ్ఞానమెట్లుండును? జ్ఞాననిష్టుడు, ధర్మజ్ఞుడు, విజితేంద్రియుడు, విరక్తుడునైననూ, దేహముం దగా మోక్షము పొందలేడు. దేహధారులు అపక్వులు, పరిపక్వులు అని రెండు విధములు. యోగహీనులు అపక్వులు. యోగము కలవారు పరిపక్వులు.


             యోగాగ్నిచే సర్వదేహము శోకవర్జితమై అజడమగును. దేహము పార్ధివము, జడము, అపక్వము, దుఃఖమిచ్చునది యని తెలియవలెను. ధ్యానస్థుడైననూ అతడు ఇంద్రియములచే స్వాధీనుదగును.  ఆ ఇంద్రియములను గట్టిగా నియమించిననూ, నిగ్రహించిననూ, ఇతరమైన వాటిచే బాధపడును. శీతొష్ణములు, సుఖదుఃఖాదులు, మానస వ్యాధులు, ఇంకా ఇతరములైన నానావిధజీవములు, శస్త్రములు, అస్త్రములు, జలము, గాలి వీటన్నిటిచేతను, శరీరము బాధింపబడును. దానితో మనస్సు క్షోభ చెందును. అట్లే ప్రాణాపాయ సమయమున వాయువు క్షోభ చెందును. అంతట అనేక దుః ఖములతో వ్యాప్తమై చిత్తము క్షోభపడును.(ఇక్కడ మనకు ధ్యానానికి, యోగానికి ఎన్నిరకాల అడ్డంకులువస్తాయో అన్నీచెప్పారు) దేహావసాన సమయ మున దేహి దేనిని భావించునో ఆయారూపుడే జీవుడగును. (పూర్వము జడభరతుడనే ముని దేహావసాన సమయములో ఒక లేడిని చూడగా, ఆతర్వాత ఆలేడి కడుపునే జన్మించవలసి వచ్చిందట. దీని గురించి "పరమహంస సచ్చిదానందులవారు",
విశదీకరిస్తూ "జీవబ్రహ్మైక్య రాజయోగ సారామృతము" అనే గ్రందములో  ఒక ప్రకరణము పెట్టారు. వీలయితే ఒకసారి చదవండి.) ఆ రీతిగా జన్మ కారణమున్నది. దేహాంతమున ఆ జన్మఎమైనది? దానిని మానవు లెరుగరు. కావున జ్ఞానము వైరాగ్యము జీవునకు కేవలము శ్రమయే (యోగము లేనప్పుడు). దేహమునంతుకొన్న చీమ ఏదో అలోచించుచూ శరీరమునుండి జారిపడునట్లు తేళ్ళచే దష్టుడై ఈ జీవుడు సుఖపడడే, దేహాంతమున ఎట్లు సుఖపడును? కావున మిథ్యాతర్కముచే నిండిన వారైఎరుగరు. ఎవనికైనా అహంకారమెపుడు నశించునో అతనికప్పుడే దేహముకూడా నశించును. కారణము లేకుండా కార్యమెప్పుడూ ఉండదుకదా! అట్లే అహంకారము లేకుండా దేహమందు దుఃఖ మెట్లుండును? జనులందరూ దేహముచే జయింపబడినారు. కాని యోగులచే శరీరము జయింపబడినది. కనుక సుఖదుఃఖాదిఫలము వారికెట్లు కలుగును? ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, కామక్రోదదికమును జయింపబడినవి. వానిచే సర్వము సంహరింపబడినవి. యోగాగ్నిచే మెల్లగా సప్తదాతుయుక్తమైన దేహము దగ్ధమైనది. మనోబలము గల యోగదేహము దేవతలచేత గుర్తింపబడదు (అందువల్లే దేవతలు యోగులను చూసి ఈర్ష్యపడతారు). 

             బేధబంధములు కలది, నానాశక్తిధరమునైనది "పరాత్మ దేహము ఆకాశమువలె నుండును. ఆకాశము కన్ననూ నిర్మలము, సూక్ష్మము కన్నసూక్ష్మము, దృశ్యము కన్నా స్థూలము, జడము కన్నా జడము. [ఇక్కడ యోగమార్గము (astral-travel) లో ప్రయాణించు యోగి యొక్క ఆత్మ ధరించు, తత్సంబంధ యానకమైన, దేహము గురించి చెప్పినారు.] ఇచ్ఛారూపుడైనవాడు యోగీంద్రుడు. స్వతంత్రుడు, అజరామరుడును, ముల్లోకములందునూ ఎక్కడోనొకచోట క్రీడించుచుండును. అచింత్యశక్తిగల యోగి నానారుపములను ధరించును. విజితేంద్రియుడై స్వేచ్ఛగా వాటిని ఉపసంహరించుకోగలడు. (దీనికి 'ఒక యోగి ఆత్మకధ'లో దృష్టాంతరాలు లభిస్తాయి. శ్రీ పరమహంస యోగానంద గారికి, ఒకేసారి రెండు శరీరాలు ధరించే శక్తిగల ఒక యోగి తారసపడతారు. అలాగే మహావతార్ శ్రీ బాబాజీ గారు, ఒకానొక సందర్భంలో "నేను అప్పటికప్పుడు అక్కడ వుండే అణువులను సంయోగపరచి నాకు కావలసిన దేహమును దరించ గలను, మరలా ఆ శరీరాన్ని అణువులుగా విభజించగలను" అని వివరిస్తారు.) యోగ బలముచే యితడు మరణముబొందడు. యితడు హరునిచే మృతుడు గనుక మృతునికి మరల మరణమెట్లుండును? (ఈ వాక్యము మహావతార్
శ్రీబాబాజీ, శ్రీ త్రిలింగస్వామి లాటివారికి సరి పోతుంది.) 
అందరికినీ ఎక్కడ మరణమో, అక్కడనతడు జీవించును. మూఢుడెక్కడ జీవించి యుండునో, అక్కడతడు మృతుడైయుండును. అతనికి కర్తవ్యమేమియు లేదు. చేసిన దోష వర్జితుడై యుండును. విరక్తులైన కొందరు జ్ఞానులు దేహముచే జయింపబడినారు. మాంసపు ముద్దలుగా కల్పితమైన దేహముకల వీరు యోగులతో తుల్యులెట్లు కాగలరు? (జ్ఞానము కలిగి కూడా యోగాభ్యాసము లేని వారి సంగతి ఇక్కడ చెప్పబడినది). (యోగాభ్యాసము లేని) జ్ఞానులచే, దేహాంతమున పుణ్యము వలననూ, పాపమువలననూ ఫలము పొందబడు చున్నది. ఇటువంటివాడైనవాడు ఆయా కర్మఫలముల ననుభవించి, మరల జ్ఞాని యెట్లు కాగలడు? (యోగాభ్యాసమువలన పక్వముకాని జ్ఞాని, పాపపుణ్యములఫలములననుభవించు టకు గాను తిరిగితిరిగి జన్మలెత్త వలసి వచ్చును. అప్పుడు ఇంకనూ పాపపుణ్యములు చేసినచో, ఆ ఫలితములనుభవించుటకే జన్మలు సరిపోవును గాని, మరల జ్ఞానము ఎలా పొందును?) తరువాత పుణ్యముచే సిద్ధునితో(సద్గురువుతో) సాంగత్యము లభించును. అప్పుడు సిద్ధుని యెక్క దయచే యోగి యగును, లేనిదే కాడు. అంతట సంసారమునశించును. లేనిదే కాదు. (ఒక్కసారి యోగభంగము కలిగితే, మరల యోగికావడము ఎంతదుస్తరమో తెలియజేశారు.) యోగములేకుండా జ్ఞానము మోక్షమునీయదు. అనేకజన్మల జ్ఞానముచే యోగము లభించును. యోగము వలన ఒక్కజన్మలోనే (పరబ్రహ్మ విషయకమైన) జ్ఞానము కలగును.

                              (Please visit www.tatvavisleshana.weebly.com)    

No comments:

Post a Comment