Friday, June 29, 2012

కర్తవ్యాచరణ

                                                    కర్తవ్యాచరణ
       మనం ఈలోకంలో ఎందుకు జన్మించామో, ఎందుకు పరమాత్మను చేరుకోవాలో, ఎలా ఈ ప్రకృతి లో వివిధఅజ్ఞానభూమికలలో ఉన్నామో  తెలుసుకున్న తర్వాత, మన జీవితలక్ష్యమైన పరమాత్మను చేరుకోవటానికి మార్గదర్శకులైన వారిని, అదే సద్గురువుని ఆశ్రయించాల్సిన అవుసరం గురించి తెలుస్తుంది. అప్పుడు యోగ్యుడైన సద్గురువునాశ్రయించి, ఉపదేశాదులు పొంది, అజ్ఞానాన్ని తొలగించు కొని, సప్తవిధభూమికలు కలిగిన జ్ఞానాన్ని పొంది, సద్గురువు పర్యవేక్షణలో పరబ్రహ్మ స్వరూపాన్ని అనుభవములోనికి తీసుకోనివచ్చే యోగాన్ని ప్రారంభించి, జ్ఞానాన్ని, యోగాన్ని, అనుభవాన్ని అను సంధానించుకొనుచూ, ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది సమాధ్యవస్థను పొందుతాము. ఈ విషయమై మహానుభావులు, సనాతనులు చెప్పిన విషయాలను తెలుసుకుందాము. కొన్ని వివరణలు బ్రాకెట్లలో ఇవ్వడమైనది.
సద్గురునాశ్రయము:
అద్వయతారకోపనిషత్:
               
           9. గురురేవ పరబ్రహ్మ, గురురేవ పరాగతిః, గురురేవ పరావిద్యా, గురురేవ పరాయణం, గురురేవ పరాకాష్ఠా, గురురేవ పరంధనం, యస్మాత్తదుపదేష్ఠా, సౌ తస్మాత్ గురుతరో గురుః||
           గురువే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మమును చేరు త్రోవ గురువే. ఆ చేరుటకు కావలిసిన జ్ఞానము గురువే. ఆ చేరుట అనే ప్రక్రియ కూడ గురువే. దానికి కావలసిన సాధనసంపత్తి కూడ గురువే. ఈ విధముగా ఉపదేశికులైన మీరు గురువులలోకెల్ల సద్గురువులు.

 
ముండకో
పనిషత్:ప్రధమ ముండకం:ద్వితీయఖండం:

              
12, 13: బ్రహ్మజ్ఞాని కర్మచే ప్రాప్తించు లోకముల యొక్క తారతమ్యములను పరీక్షించి తెలుసుకొని, మోక్షము కర్మలచేత లభించదని గ్రహించి, వైరాగ్యమును పొంది, బ్రహ్మము నెరుంగుటకై, సమిధలు హస్తమునందు గలవాడై, శ్రోత్రీయుడును, బ్రహ్మనిష్ఠుడునునగు గురువును నాశ్రయింప వలెను. ఆ ప్రకారముగా గురువును చేరినట్టి శాంతశమదమాదిసద్గుణములు కల శిష్యునకు ఆ గురువు అక్షరమును, సత్యమును అగు పరమాత్మను తెలిసికొనుటకు సాధన రూపమగు బ్రహ్మ విద్యను యుపదేశించవలెను. (ఇక్కడ మొదట శిష్యుడు ఎలా తన్ను తాను తయారు చేసుకోవాలో, ఎటువంటి గుణములు, ఆలోచనలు, భావాలు కలిగియుండాలో విశదీకరీంచారు. మొదట ఎవరికివారు, నేను ఏమి చేస్తున్నాను? నేను చేసే వాటికి ఫలితమేమిటి? నేను చేసేది నాకు కావలిసినది ఇస్తుందా? అని ప్రశ్నించు కోవాలి. ఇంకా నాకు నిజంగా కావాల్సినదేమిటి? అందుకు నేను త్రికరణశుద్ధిగా ప్రయత్నంచేస్తున్నానా? అనికూడా ప్రశ్నించుకోవాలి. అప్పుడు నిజంగా బ్రహ్మజ్ఞానులవ్వాలి అనే కోరిక వుంటే, మనం చేసే భౌతికకర్మలు, జప, దాన, యజ్ఞ, వాపీకూపతటాకాది నిర్మాణాలు, ఫలితాన్నిఆశించి చేసే కర్మలు, పనులు ద్వారా పరబ్రహ్మాన్ని తెలుసుకోలేము, అవి మోక్షాన్ని ఇవ్వలేవు అని తెలుస్తుంది. అప్పుడు మనకు నిజంగా ఈ ప్రపంచంపట్ల, అందులో మనం చేసే పనులపట్ల విరక్తి, వైరాగ్యం వస్తుంది. సరిగ్గా ఈ విషయాన్నే శ్రీ ఆదిశంకరాచార్యులవారు బ్రహ్మసూత్రాలలొని మొదటి సూత్రములోనే  మనకు చెప్పారు. "అథాతో బ్రహ్మ జిజ్ఞాసా"  అంటే "పిమ్మట, కాబట్టి, బ్రహ్మమును తెలిసికోనుటకు కోరిక". వెంటనే మనకు ప్రశ్నలు రావాలి. దేని పిమ్మట? ఎందుక్కాబట్టి? సమాధానం ఏమిటంటే, వివేకాదిసాధనసంపత్తి సిద్ధించిన 'పిమ్మట', కర్మఫలం అనిత్యమైనదని, జ్ఞానఫలమైన 'మోక్షం' శాశ్వతమైనదని తెలిసినది 'కాబట్టి' ముముక్షువైనవాడు బ్రహ్మమును తెలుసుకొనుటకు కోరాలి. దీనివల్ల మనకు తెలిసేదేమిటంటే, మనం పరబ్రహ్మను తెలుసుకొని, మోక్షాన్ని పొందుటకు సద్గురువు దగ్గరకు వెళ్ళేముందే, మనల్ని మనం సంస్కరించుకోవాలి, సన్నద్ధపరచుకోవాలి, పవిత్రీకరించుకోవాలి, శుద్ధ మనస్కులవ్వాలి, మనం దేన్ని కోరుకుంటున్నామో నిర్దుష్టంగా తెలుసుకోవాలి, (ఇప్పటిభాషలో చెప్పాలంటే, clear goal fix చేసు కోవాలి), దాని కోసం, నీళ్ళల్లో మునిగిపోయినవాడు ఊపిరికోసం ఎలా కొట్టుకుంటాడో. ఒడ్డున పడ్డ చేప నీళ్ళ కోసం ఎలా కొట్టుకుంటుందో, అల్లా పరితపించాలి. (ఇప్పుడు మనకిమనం ప్రశ్నించుకుందాం. మనం ఎప్పుడైనా అల్లా పరమాత్మ కోసం పరితపించామా?) ఇటువంటి అవస్థను అనుభవిస్తే, అప్పుడు మనకి సద్గురువు అవుసరం కనపడుతుంది. అప్పుడు మనం సద్గురువు కోసం వెతకాలి. అంతేగాని, ఏదైనా క్షణకాలబాధకలిగినప్పుడో, ఏదైనా పుస్తకంలోని రెండువాక్యాలు చదివినప్పుడో, ఎవరిదైనా ఉపన్యాసంలో రెండువాక్యాలు విన్నప్పుడో, క్షణికోద్రేకానికిలోనయి, నాకు అర్జెంటుగా మోక్షం వచ్చెయ్యాలి, అర్జెంటుగా సమాధి వచ్చెయ్యాలి, గురువు కావాలి, గురువు, గురువు అంటూ పరుగులు పెడితే సద్గురువులు దొరకరు. ఒకవేళ దగ్గరలో వున్నా, నిర్మలమనస్సులేని మనకు తెలియరు. కాబట్టి నిజంగా పరబ్రహ్మ ను తెలుసుకోవాలని కోరిక వున్నప్పుడు, దానికి తగిన విధంగా మనలను మనం సన్నద్ధ పరచుకొని, సద్గురువు కోసం వెతికితే, తప్పని సరిగా లభిస్తారు. ఇంకా చెప్పాలంటే,  'ఒక యోగి ఆత్మకధ' లో లాగా, శ్రీపరమహంస యోగానందగారికోసం శ్రీయుక్తేశ్వరగిరిగారు వచ్చినట్లు ఆసద్గురువే శిష్యుని వెతుక్కుంటూ వస్తారు. ఏ మాత్రము అధైర్యపడనవుసరం లేదు. శ్రీగురుమండలి అలా కల్పించగలదు.)

పైంగలోపనిషత్:పంచమాధ్యాయము:


            మొట్టమొదట శమదమాది  సద్గుణములతో, సద్గురువు తన శిష్యుని పరిశుద్ధునిగా చేయ వలెను. ఆ పిమ్మట, ఈ సర్వము బ్రహ్మమనియు, శిష్యుని నీవు పరిశుద్ధుడవనియు బోధన చేయ వలెను. అజ్ఞునకు (అధికారము లేనివానికి) సర్వము బ్రహ్మమే అని ఎవడు చెప్పునో, అతడు ఆ యజ్ఞుని వలన మహా నరకములోనికి త్రోయబడును. (ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అసలు గురువు దగ్గరకు వెళ్ళేటప్పటికే, మనలని మనం సంస్కరించు కొనివుండాలి. అలా చేసుకొని ఉన్నప్పటికీ, ఎమాత్రంగానైనా సందేహాలు గాని, సంశయాలు గాని, అజ్ఞానము గాని ఉన్నచో, గురువు వాటిని పోగొట్టి శిష్యుని పరిశుద్ధుణ్ణి చేయాలి. ఎందుకంటే, విత్తనం మొలకెత్తాలంటే, భూమిని బాగా దున్ని, రాళ్ళు రప్పలు ఏరివేసి చదును చేయాలి కదా! అలా పరిశుద్దుడు కాని శిష్యుని మనస్సులో గురువు ప్రభోధించే పరబ్రహ్మ విషయాలు లోతుగా నాటుకోవు. తర్వాత అనుభవానికి రావు. అలా లేని శిష్యుడు బయట ఏదైనా తప్పుగా చెపితే, ఆ దోషం గురువుకి వెడుతుంది. ఎవరైనా ఏదైనా తప్పుగా చెపితే, వెంటనే మనం, ఈ విషయం ఎవడు చెప్పాడురా? అంటాము. తత్ఫలితంగా గురువు తనస్థానం నుండి దిగజారి అధోగతి పాలవుతాడు. అందువల్ల అధికారం ఆంటే అర్హతవున్న శిష్యునికే పరబ్రహ్మ విషయాలు ప్రభోదించాలి. అలాకాని పక్షంలో మొదట శిష్యునికి అర్హత వచ్చేలా చేసి ఆ తర్వాతే మిగతా విధానం లోనికి వెళ్ళాలి. లేకపోతే శిష్యుడు పైకి వెళ్ళడం అటువుంచి, గురువు అధోగతి పాలవుతాడు.)

         కావున ఎవని బుద్ధి ప్రబుద్ధమైనదో, ఎవనికి భోగేచ్చ నశించియున్నదో, ఎవనికి ఆశలు పోయినవో, అట్టివానికి ప్రాజ్ఞుడగు గురువు, అవిద్య, మాయ, లేనతనికి, వేదాంతబోధ చేయవలెను. దీపమున్నప్పుడే ప్రకాశమునకు ఉనికి కలదు. సూర్యుడున్నప్పుడే దిపమునకు సత్తయుండును. చిత్ సత్తయే జగత్తు నకు సత్త అయివున్నది. జ్ఞాన దృష్టి కలిగినప్పుడు, జ్ఞానోదయమైనపుడు, స్వస్థచిత్తుడవై నాయొక్క వాక్ దృష్టి (బోధ) యొక్క బలాబలములను నీవు గ్రహించగలవు. ఆ విద్య వలననే, సర్వదోషాపహారిణియగు విద్య (ఆత్మ జ్ఞానము) ప్రాప్తించును. జ్ఞానోదయముతో  నేను, నాది అను స్వార్థబుద్ధి నశించి ఉత్తమ పురుషార్థము లభించును. శుద్దాంతః కరణ యందే ఆత్మకార వృత్తినశించును.

యోగవాశిష్ఠము:నిర్వాణప్రకరణము:ఉత్తరభాగము: ఆఖరిసర్గ:


           22, 23: పరమపురుషార్థ (మోక్ష) ప్రదమగు ఆత్మజ్ఞానమునుపదేశించిన గురువుయొక్క యట్టి మహోపకారమునకు దాగిన ప్రత్యుపకారము నే కర్మచే శిష్యులు చేయగలరు? కాబట్టి మనో వాక్కాయ కర్మలచే శిష్యులు గురువునకు ఆత్మనివేదనము (తనను తాను గురుచరణములందు సమర్పించు కొనుట) గావింప వలెను. అదియే గురువులకు దాగిన ప్రత్యుపకారము. అంతేకాని, మరియే ఇతర కర్మచేతను ప్రత్యుపకారము కానేరదు.
                           (Please visit www.tatvavisleshana.weebly.com)          

No comments:

Post a Comment