Thursday, June 28, 2012

మన స్థితి

మన స్థితి
                 పరమాత్మ సృజించిన సృష్టిలో ప్రస్తుతం మనం ఏ స్థితిలో ఉన్నామో, అంటే ఎలా భ్రమల్లో, అజ్ఞానంతో ఆయా ఆవస్థలలో ఉన్నామో తెలుసుకుందాం. మనం గతంలో, ఇప్పుడు, భవిష్యత్తులో ఉన్న, ఉండబోతున్న భ్రమలు, అవస్థలు, అజ్ఞానం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే, అజ్ఞానాన్ని తెలుసుకుంటే, దానినుండి బయటపడి, సమ్యక్ జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాము కాబట్టి. భ్రమలనుండి బ్రహ్మాన్ని చేరే విధానం తెలుసుకుంటాము కాబట్టి. ఈ విషయంలో సనాతనులు, పెద్దలు, తత్త్వవేత్తలు ఏమి చెప్పారో తెలుసుకుందాం. కొన్ని వివరణలు బ్రాకెట్లలో ఇచ్చాము. 
భ్రమలు:
అన్నపూర్ణోపనిషత్:ప్రధమాధ్యాయము:
                 భ్
రమలు 5 విధములు. జీవుడు ఈశ్వరుడు భిన్నరుపులు అనునది మొదటి భ్రమ. (మనం సాధారణంగా చేసే మొదటి పొరపాటు ఇదే. మనలో ఉన్న ఆత్మ, పరమాత్మ వేరే అనుకోవడం. పైంగలోపనిషత్ ప్రకారం, "సృష్టి అంతా ఏర్పాటు అయిన తర్వాత ఆ సృష్టి అంతా జడముగా, ఎటువంటి స్పందన లేకుండా వున్నది. అప్పుడు పరబ్రహ్మ ఈ పరిస్థితిని గమనించి, ఈ సృష్టిలో  చైతన్యము అనగా తాను లేనందున ఇది అంతా జడముగా ఉన్నదని, బ్రహ్మండములను, సమస్త వ్యష్టి శరీరముల యొక్క మస్తకములను బ్రద్దలుచేసి, ఆ బ్రహ్మరంధ్రముల వాటన్నింటి యందు చైతన్యరూపములో ప్రవేశించెను. ఆ శరీరములు మొదట జడములుగా నున్ననూ, ఈశ్వరచైతన్యము ప్రవేశింపగనే చైతన్యవంతములైనవి. ఈశ్వరుడు దేహత్రయతాదాత్మ్యము వలన కర్తృత్వమును భోక్తృత్వమును కలవాడయ్యెను. జీవుడుగా నున్న ఈశ్వరుడు  స్థూల సూక్ష్మ కారణ దేహములను తానుగా అంటే దేహమే తానను భ్రాంతిగా భావించుట వలన, మేలుకొనుట, స్వప్నములను గాంచుట, నిద్రపోవుట, మూర్ఛిల్లుట, మరణము పొందుట మొదలగు ధర్మములను కలిగినవాడై కులాల చక్రము, కుమ్మరి సారె వలె పరిభ్రమించుచున్నాడు."  చూసారా! సృష్ట్యాదిలో ఆ పరమాత్మే మనశరీరాల్లొ చైతన్య రూపంలో ప్రవేశిస్తే గాని మనకు వున్న జడత్వము పోలేదు. కాబట్టి మనలో నున్నది అంటే ఆత్మ ఆ పరమాత్మ యొక్క అంశమే! ఈవిషయములొ ఏమాత్రము తేడాగాని, పొరబాటు గాని లేదు.) ఆత్మనిష్టమైన కర్తృగుణము వాస్తవమనునది(నేను అంటే  అర్థము దేహము అనే భావము) రెండవ భ్రమ.  శరీరత్రయముతో గూడిన జీవుడు సంగము కలవాడన్నది (స్థూల సూక్ష్మ కారణ దేహములతో కూడిన పరమాత్మ ఈ పాంచభౌతిక దేహముతో సంగముకలవాడనే భావము) మూడవ భ్రమ.  జగత్కారణ రూపమునకు వికారిత్వము (పరమాత్మ వేరే, ప్రకృతి వేరే అనే భావము) నాల్గవ భ్రమ. కారణముకన్న భిన్నమైన జగత్తు సత్యమన్నది (మన కంటికి కనబడే ఈప్రకృతి శాశ్వతమైనదనే భావము) పంచమ భ్రమ.
                పంచభ్రమ నివృత్తియు అప్పుడు చిత్తమున స్పురించెను. బింబ ప్రతిబింబ దర్శనము చే భేద భ్రమ తొలగిపోయెను. (అద్దము లో మన ప్రతి బింబాన్ని మనం చూసుకుంటే, బింబము వేరు, ప్రతిబింబము వేరు కాదు. అలాగే మన శరీరములో ప్రతిబింబించిన ఆత్మ పరమాత్మ రూపమే. వేరుకాదు.) స్పటిక లోహిత దర్శనముచే పారమార్ధిక భ్రమ పోయినది. (స్పటికము అంటే ఏదైనా రత్నముమీద బయటినుండి కాంతి పడినప్పుడు ఆ కాంతి ఆ రత్నం లోపలనున్న వివిధ కోణాలలో నున్న తలాలలో ప్రతిఫలించి ఇంకా కాంతివంతముగా కనపడుతుంది. అప్పుడు మనం ఆ కాంతి ఆ రత్నానిదే అనుకొంటాము. కాని నిజానికి ఆ కాంతి వేరే చోటునుండి వచ్చినది. కాని మనం ఈ ప్రతి ఫలించడం అనే భ్రమలో  పడిపోయి ఆ కాంతి రత్నానిదే అనుకొంటాము. అలాగే నేను అన్న దానికి మనకు భౌతికంగా ప్రత్యక్షంగా కనపడే ఈ శరీరం కాదు. ఇప్పుడు మనకి మనం కొన్ని ప్రశ్నలు వేసుకొందాము. నేను తొడుక్కున్న చొక్కా ఎవరిది? జవాబు నాది. నేను పెట్టుకున్న వాచీ ఎవరిది? జవాబు నాది. ఈ శరీరం ఎవరిది? జవాబు నాది. ఈ మూడో జవాబులో వున్న 'నాది' అన్నది ఎవరూ? ఆలోచించండి. ఈ శరీరం కాక ఇంకోటేదో ఈ శరీరాన్ని నాది అంటోంది. అదే ఆత్మ. 'నేను'  అనే పదానికి నిజమైన కర్త ఆత్మే.)  ఘటమఠాకాశ దర్శనముచే సంగి అన్న భ్రమ తొలగిపోయెను. (మన ఇంటిలో ఒక కుండను చూడండి. ఆ కుండలో ఏమి లేకపోయినా శూన్య ప్రదేశము అంటే ఆకాశము వుంటుంది. అలా చూస్తూ వుంటే మనం ఆ ఆకాశమునకు  కుండతో వున్న సంబంధం వల్లే అలా వుందని, లేకపోతే దానికి ఉనికి లేదని అనుకుంటాము. మనం ఆ కుండను  బ్రద్దలు కొట్టామనుకోండి. అప్పుడు ఆ కుండలో వున్న ఆకాశము, కుండ బయట వున్న మహా ఆకాశము తో కలసి పోతుంది. కుండ లేకపోతే ఆకాశము యొక్క ఉనికికి ఏమాత్రం భంగము వాటిల్లదు.  అల్లాగే ఈ శరీరంలో వున్న ఆత్మ ఈ శరీరము తో వున్నట్లు కనిపించిన, నిజానికి లేదు. ఈ శరీరము లేకపోతే ఆ పరమాత్మ లో వుంటుంది. అందువల్ల ఆత్మకు ఈ శరీరముతో ఎంతమాత్రము సంగము అంటే సంభందము లేదు.) కనకరుచిక దర్శనముచే వికారిత్వ భ్రమ పోయినది. (మన ఇంట్లో వున్న ఉంగరము, నెక్లేసు, పాపిడి చేరు, గాజులు, వడ్డాణము, అరవంకీలు వంటి బంగారు ఆభరణాలు పరిశీలించండి. వాటికన్నింటికీ వేరువేరు ఆకారాలు, రూపాలు, పేర్లు వున్నాయి. దేనికదే విడివిడిగా దాని ప్రత్యేకత దాని కుంటుంది. ఇప్పుడు మరల వాటి నన్నింటినీ వాటికి మూల వస్తువైన బంగారంలా చూడండి. ఇప్పుడవన్నీ ఒక్కటే! ఒకే మూల వస్తువైన బంగారం రకరకాలైన రూపాలుగా మార్చుకుని, రకరకాలైన వస్తువులుగా, రకరకాల పేర్లతో పిలువబడుతోంది. అదే ఒక్క బంగారమే. అలాగే ప్రకృతిలో ఎన్ని రకాలుగా మారి కనిపించినా, వాటికన్నింటికి మూల కారణమైన పరబ్రహ్మ ఒక్కటే!) రజ్జుసర్ప దర్శనముచే కారణభిన్నజగత్తుకు సత్యత్వ భ్రమ పోయినది. (చీకటిలో మనం తాడును చూసి పాములా భ్రమ చెందు తాము. ఆ పాముని నిజమనుకొని చంపడానికి కర్ర తెస్తాము. ఈలోగా ఎవరో దీపం తెస్తారు. ఆ వెలుతురులో తాడుని చూసి అయ్యో నేను పాము అనుకొన్నది నిజంగా తాడా! అనుకొంటాము. ఇప్పుడు చూడండి. దీపం వెలుతురు లేనంతవరకు పాము సత్యము. వెలుతురు పడినతర్వాత తాడు సత్యము. అలాగే మనం చూసేటటువంటి, అనుభవానికి వచ్చేటటువంటి ఈ ప్రకృతినే నిత్యమని, సత్యమని, శాశ్వతమని తలుస్తాము. నమ్ముతాము. కాని  తత్వ విచారమనే దీపాన్నితెచ్చి, జ్ఞానమనే వెలుతురులో చూస్తే, నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది ప్రకృతి కాదని, దానికి మూలకారణమైన పరమాత్మని తెలుస్తుంది.)   అప్పుడు భ్రమల్లో నున్న నా చిత్తము బ్రహ్మాకార మైనది.   
(తదుపరి విషయము కొరకు www.tatvavisleshana.weebly.com సందర్శించండి.)

No comments:

Post a Comment