Saturday, June 23, 2012

అదేమిటి?

                     పరబ్రహ్మ స్వరూపమేమి?

              మనం పరబ్రహ్మ స్వరూపాన్ని ఎందుకు తెలుసుకోవాలో విచారించిన పిమ్మట అదేమిటో తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది మహనీయులు, బ్రహ్మాన్ని తెలుసుకొన్న వాడు బ్రహ్మమే అవుతాడని స్వానుభవంతో తెలియజేసారు. కొందరు బ్రహ్మాన్ని తెలుసు కొన్నాననుకొంటే అజ్ఞానమని, తెలుసుకోలేక పోయానని తెలుసుకొంటే, దాని గురించి తెలియటం మొదలవుతుందని చెప్పారు. ఎంత చెప్పినా అది పూర్తి అవదని, దానికి నిర్వచనాలు లేవని, కేవలము అనుభవపూర్వకమని కొందరు తెలియజేసారు. మనం గతంలో అనుకున్నట్లు నిజంగా పరబ్రహ్మను పొందినవాడు ఈలోకంలో ఉండడు. కాని కొంతమంది మహానుభావులు ఆస్థితిలో చివరి వరకూ  వెళ్లి, మళ్లీ వెనక్కు వచ్చి, మనలాంటి వారికోసం కొంతవిషయాన్ని అక్కడక్కడ చెప్పారు. ఒకమాట మాత్రం నిజం. మనం మనుష్యులం కాబట్టి, మాయామయమైన శరీరంతోటి, అంతఃకరణాలతోటి జీవిస్తున్నాం కాబట్టి, ఈ అజ్ఞానం తొలగే వరకూ (పూర్తిగా పనికి రానప్పటికీ) కొంచెం ప్రాపంచకమైన జ్ఞానంతోటి, మన బుద్ధికి, మనస్సుకు అందే విషయాలతోటి దాన్ని తెలుసుకొనేందుకు ప్రయత్నిద్దాం.  అంతవరకూ దోషమేమీ లేదు. దాని సంగతి తెలిసిన పిమ్మట, దాని కోసం ఉపయోగించిన ప్రాపంచిక విషయాలను వదలివేసి, పూర్ణ మైన జ్ఞానాన్ని మాత్రమే ఆశ్రయిద్దాం. ఎందుకంటే "సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ" కాబట్టి.
              ఈ విషయమై అనుభవం పొందిన మహాత్ములు, అనన్యచింతనులు, ఋషులు, యోగులు ఏ విధంగా తెలియజేశారో పరిశీలిద్దాం.  (కొన్ని వివరణలు బ్రాకెట్లలో యివ్వడమైనది).
ఈశావాశ్యోపనిషత్:
             
4. పరమాత్మ ఒక్కటే చలనరహితమైనది. అయినా మనస్సుకంటే మహావేగము కలది.  మనసుకంటే ముందే వెళ్ళుటవలన, అది యింద్రయములకు చిక్కదు. నిత్యమైనది. స్థిరమైనది అయినప్పటికీ, పరిగెత్తే అన్నింటిని అది దాటి పోవుచున్నది.  ఆత్మ సాన్నిధ్య మున్నందు వలననే జీవకోటులు తమ కార్య కలాపములను సాగించుటకు సమర్థవంతము లగుచున్నవి. (ఇక్కడ పరమాత్మ యొక్క వైవిధ్యలక్షణాలను చెపుతున్నారు. పరమాత్మ అన్నిచోట్ల ఉన్నందున మనం ఎంత వేగంగా వెళ్ళినా, అక్కడ మనకన్నా ముందరే వెళ్లి ఉన్నట్లు తోస్తుంది. అందువలన అది ఎక్కడికి వెళ్ళనప్పటికీ అత్యంత వేగంగాఉన్నట్లు తోస్తుంది. మనం గజేంద్రమోక్షంలో తెలుసుకున్నట్లు ఆ పరమాత్మ ప్రవేశించినందు వల్లనే ఈ జీవులన్నియూ చైతన్యవంతములై తమతమ కార్యకలాపములను చేయు సమర్థములైయున్నవి.)        

             
5. ఆ ఆత్మ చలింపదు. దూరములో నున్నది. దగ్గరగా నున్నది. అదియే సర్వ వ్యాపకముగా నున్నది. ఈ అంతటి వెలుపల, లోపల గూడ నున్నది. (పైన చెప్పినట్లు ఆ పరమాత్మ అన్నిచోట్ల ఒకేసారి ఉన్నందున ఈ విధంగా తోస్తుంది. ఒకసారి చర్చలలో, ఒకేసారి దూరంగానూ, దగ్గరగాను ఎలా వుంటుంది? అన్న ప్రశ్న వచ్చింది. మనం ఎదురెదురుగా (face to face) కూర్చుంటే ఎలా వున్నాము? చాలా దగ్గరగా వున్నాము. అలా ఉన్నచోటనే ఒకరి కొకరు వ్యతిరేకదిశలో కూర్చుంటే ఎలా వున్నట్లు? ఎంత దూరంలో వున్నట్లు? ఒక్కసారి ఆలోచించండి! అలాగే మనం పరమాత్మ వైపు తిరిగితే మనకు ఆయన చాలా దగ్గరగా ఉంటాడు. ఆయనకేసి తిరగకపోతే చాలా దూరంగా ఉంటాడు. ఇక్కడ చెప్పిన ఆయన సర్వవ్యాపకత్వాన్నే
మనం ప్రతిరోజూ చదువుకొనే మంత్ర పుష్పంలో "యచ్ఛకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా, అంతర్ బహిశ్చతత్సర్వం వ్యాప్యనారాయణ స్థితః" అంటే 'ఏదయితే మనకు కనపడుతూ, వినపడుతూ వుండే ప్రకృతి  వుందో, దాని లోపలా బయటా అంతా ఆపరమాత్మే నిండివున్నాడు' అని శృతి చెప్పింది.)
              8. స్వయంభువు, సర్వవ్యాపి, అశరీరి, అస్నాయువు, పాప కళంక రహితుడు, ఉజ్జ్వలుడు, పరిపూర్ణుడు, స్వచ్ఛమైనవాడు, సర్వదర్శి, సర్వవిదుడు, సర్వ పరిఛ్చేదకుడు, అయిన పరమాత్మ శాశ్వతులైన ప్రజాపతులకు వారివారి కర్తవ్యములను నిర్ణయించి యిచ్చినాడు.
కేనోపనిషత్: ప్రధమ ఖండం:
              ౩. పరబ్రహ్మమును నేత్రముతో చూచుటకు వీలుకాదు. వాక్కుతో చెప్పుటకు వీలు కాదు. మనస్సుతో చింతించుటకు వీలుకాదు. అట్టి ఆత్మను బోధించుట ఎట్లు? మాకు తెలియదు. అది తెలియువాటికి, తెలియబడని వాటికి, అతీతముగా నున్నది. మా గురుదేవులు (సనాతనులు) ఈ రీతిగా చెప్పు చుండుట వినియుంటిమి.   
               4-8. ఏ ఆత్మ వాగింద్రియముచేత గ్రహించబడదో, దేని శక్తిచేత వాగింద్రియము పని చేయుచున్నదో, దీనిని చక్షుస్సు చూడ లేదో, దేనిచే అంతఃకరణవృత్తులను చూచునో, దేనిని చెవితో వినుటలేదో, దేనిచేత ఈశ్రవణేన్ద్రియము పనిచేయుచున్నదో, ఏది మనసుచేత భావించుటకు అశక్యమగునో, దేనిచేత మనస్సు పనిచేయుచున్నదో, అద్దానినే పరబ్రహ్మమని తెలియుము. అన్యమేదియు బ్రహ్మము కాదు. ఏది ఉచ్చ్వాస నిశ్వాసాత్మకమగు ప్రాణ క్రియతో తెలియ బడజాలదో, దేనిచే ప్రాణము నిజకర్మమున నడుపబడుచున్నదో, అదియే బ్రహ్మమని ఎరుంగుము. అన్యమైనదేమియు బ్రహ్మము కాదు. (ఇక్కడ మన శరీరము భౌతికవిషయ పరిజ్ఞానాన్ని గ్రహించే అవయవాల ద్వారాగాని, శరీర భౌతికకర్మల ద్వారాగాని,  పరబ్రహ్మమును తెలిసికోలేమని, ఈ అవయవాలని, వాటిని నడిపించే మనస్సుని కూడా పనిచేయించేది పరబ్రహ్మమని మనకు తెలియజేస్తున్నారు.)   
చతుర్థఖడం:
           
4. విద్యుత్తు యొక్క ప్రకాశమువలె కన్ను తెరచినప్పుడు వస్తువులు చూడనగును. అది మూయగానే వస్తువులు కనిపింపవు. క్షణమాత్రము మెరుపు మెరసినపుడు కన్నులు మిరుమిట్లు గొలుపును. విద్యుత్తు క్షణ మాత్రమే ప్రకాశించును. అట్లే బ్రహ్మము యొక్క దర్శనము కూడా! (ఇక్కడ బ్రహ్మదర్శనం లేదా ఆత్మదర్శనం గురించి చెపుతున్నారు. మొట్టమొదట్లో ధ్యానంలో ఏకాగ్రత కుదిరినప్పుడు ఎలా ఆత్మ దర్శనం అవుతుందో ఒకసారి గురువుగారు చెప్పారు. చీకటిలో మిణుగురుపురుగు వెలిగినట్లు కనపడుతుందట. వెంటనే మాయమైపోతుందట. తర్వాత ఏకాగ్రత కుదిరిన కొద్దీ కదలకుండా ఉంటుందట. ఈవిషయాన్నే ఉపనిషద్రష్ట తెలియజేస్తున్నారు.)
            6. పూర్వము వర్ణింపబడిన బ్రహ్మమే 'తద్వనం' అనబడును. ఆబ్రహ్మమును సర్వభూతాత్మగా ఉపాసించవలెను. బ్రహ్మను
'తద్వనం' అని ధ్యానించవలెను. సర్వప్రాణులు అతనిని ఆ విధముగానే కోరును. 
కఠోపనిషత్:ప్రథమాధ్యాయము: 6వ వల్లి:
            17. అంగుష్ఠమాత్ర పరిమాణము గల హృదయపద్మ పురుషుడు అంగుష్ఠమాత్రుడనబడును. అట్టి అంగుష్ఠమాత్ర పురుషుని, ముంజ యను తృణవిశేషము నుండి తదంతర్గతయగు ఇషీక, పరకను వెలుపలకు లాగునటుల సర్వశరీరము నుండి జ్ఞానము చేత వేరు పరచవలెను. వేరు పరచిన చిన్మాత్రుడగు ఆయాత్మనే శుద్ధమైన బ్రహ్మముగా నెరుంగవలెను. (ముంజ అనేది ఒకరకమైన గడ్డి. దాని ఆకులలో ఈనె వుంటుంది.  కొబ్బరిఆకుల లోంచి ఈనెను బయటకు లాగునటుల ఈ ముంజగడ్డి ఆకులలోంచి కూడా ఈనెను బయటకు లాగవచ్చును. ఆ ప్రకారంగా మన శరీరంలో ఆత్మచైతన్య రూపంలో వున్న పరమాత్మను జ్ఞానంతో వేరుపరచి దర్శింపవలెను.)
మున్డకోపనిషత్:ప్రధమమున్డకం:
ప్రధమఖండం:
             6. ఈ పరబ్రహ్మ తత్త్వము దర్శించుటకుగాని గ్రహించుటకుగాని వీలుకానిది. సంబంధము లేనిది. రంగులు, రూపములు కాని, నేత్రములు శ్రోతములు గాని, హస్తములు పాదములుగాని లేనిది. నిత్యమైనది. సర్వ వ్యాపకమైనది. సర్వగతము. అత్యంత సూక్ష్మము. అవ్యయము. సమస్త భూతముల యొక్క ఉత్పత్తి స్థానమై యున్నది. తెలిసిన బ్రహ్మజ్ఞానులు సర్వత్ర ఈఆత్మనే దర్శించుచుందురు. (ఇక్కడ ఒక విషయం, మన భారతీయ విద్యావిధానం ఎంతగొప్పదో మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి.  ఒక భాష గురించి చెప్పే మొదటి పాఠం లోనే భాషతో పాటు పరమాత్మ జ్ఞానం కూడా ఇచ్చారు.  తెలుగు వ్యాకరణంలో మొదటి పాఠం భాషాభాగాలు. అవి, నామ వాచకము, సర్వ నామము, క్రియ, విశేషణము, అవ్యయము, మొత్తం 5. వీటిలో అవ్యయము అంటే లింగ, వచన, విభక్తులు లేనిది. ఈ గుణం పరమాత్మకు చెందినది. అంటే పరమాత్మకు చెందిన జ్ఞానం మనకు మొదటి పాఠం లోనే చెపుతున్నారు. కాని మనం దానిని పట్టించుకోకుండా పెరిగి మళ్లీ దాని కోసమే ఎక్కడెక్కడో వెతుకుతాము.)
ద్వితీయమున్డకం:ప్రథమఖండం:
             2. ఆ అక్షర పరబ్రహ్మము జన్మలేనిదై, బాహ్యాభ్యంతరములలో నిండినదై. సమస్త రూపరహితమై, పరిపూర్ణమై, ప్రకాశించుచున్నది. అందువలననే ప్రాణములేనిదై ఆవ్యాకృతాది సర్వవికారముల కంటే భిన్నమై, నామరూపముల కంటే విలక్షణమై, ఉపాధి లేనిదై పరిపూర్ణముగా ప్రకాశించుచున్నది.                               
                           
ద్వితీయఖండం:
             1, 2. ప్రకాశము కలదై, అత్యంత సన్నిహితమై, హృదయగుహలో సంచరించుచున్నదై, మహత్తై, సమస్తమునకు అధారమై, సమస్త విశ్వము తనలో ధరించియున్నదై ప్రకాశించు నీబ్రహ్మమే చలనము కలిగి, ప్రాణవాయువు పీల్చి నిమేషములు కలిగియున్నది. ఈ పరబ్రహ్మమును సత్తుగాను, అసత్తుగాను, సకల ప్రజలలోను ప్రతిష్టమైయున్నదిగాను, పరమైనదిగాను, ప్రాణుల జ్ఞానమునకు అతీతముగా నున్నదాని గాను తెలిసికొనుము. ఏది కాంతి కలదో, అణువుకంటెనూ అణువైనదో, దేనియందు పృథివ్యాది లోకములను, మనుష్యాదులను ఉంచబడినారో అదియే అక్షర బ్రహ్మము. అదియే ప్రాణము. అదియే వాక్కు, మనస్సు. ఆ పరబ్రహ్మమే సత్యము. దదియే అమృతము, నాశరహితము. అదియే మనస్సునకు లక్ష్యముగా చేయ దగినది. అట్టి పరబ్రహ్మమును తెలిసికొనుము.  (ఇక్కడ పరమాత్మ హృదయగుహలో ఉన్నాడని చెపుతున్నారు. ఆ హృదయము గురించి మంత్రపుష్పంలో "అనంతమవ్యయం కవిగ్ మ్ సముద్రేంతం విశ్వశంభువం| పద్మకోశ ప్రతీకాశ
గ్ మ్ హృదయంచాప్యథోముఖం|| అధో నిష్ట్యా వితస్త్యాన్తే నాభ్యాముపరి తిష్టతి| జ్వాలమాలాకులం భాతీ విశ్వస్వాయతనం మహత్||" అనంతుడు, అవ్యయుడు, సర్వజ్ఞుడు, సంసారసాగర అంతముననుండేవాడు, విశ్వ మంగళకారుడు, అయిన పరమాత్మ అధోముఖమైన తామరమొగ్గలా వున్న హృదయంలో వున్నాడు. ఈ హృదయం కంఠానికి క్రింద, నాభికి పైన జానెడు దూరంలోవుంది. ఇందులో  విశ్వానికిఅంతటికి మూలమైన పరమాత్మ దీపశిఖలవరుసతో సమానమైన జాజ్వల్యమానమైన తేజస్సుతో ప్రకాశించు చున్నాడు అని శృతి చెప్పింది. ఇక్కడ చెప్పిన హృదయం మనకు కనపడే గుండె కాదు. మనకు రెండు రకాల శరీరాలున్నాయి. ఒకటి భౌతిక శరీరం (physical body). రెండవది శక్తి శరీరం (energitic body). ఈ రెండవ శరీరంలోనే శక్తిస్థానాలైన షట్చక్రాలూ, హృదయం మొదలైన ఆధ్యాత్మికపరిభాషలో వివరింపబడే అంగాలూ వుంటాయి.  ఈ ఆధ్యాత్మికమైన శరీరం భౌతికమైన అనుభవానికి రాదు. ఈ శరీరం అనుభవం లోనికి రావాలంటే ధ్యానం లేదా తపస్సు ద్వారా తగిన శక్తి (power) సంపాదించు కోవాలి. లేదా ఆశక్తి ఇవ్వగలిగిన వారు ఇవ్వాలి. ఇక్కడ మనకు రెండు గట్టి దృష్టాంతరములు వున్నాయి. భగవద్గీతలో, విశ్వరూపదర్శనయోగములో 8వ శ్లోకంలో కృష్ణపరమాత్మ "నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా| దివ్యం దదామి తేచక్షుః పశ్యమే యోగమైశ్వరం|| ప్రాకృత చక్షువులతో నా రూపమును నీవు నిజముగా చూడజాలవు. కనుక నీకు దివ్య (అలౌకిక) దృష్టిని ప్రసాదించుచున్నాను. ఆ దివ్యదృష్టితో నా ఈశ్వరీయ యోగరూపమును చూడుము, అని అర్జునునికి చెప్పి దివ్య దృష్టిని ప్రాసాదించాడు. ఒకసారి శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారు షట్చక్రాలూ, వాటి స్థానాలనూ వివరిస్తున్నప్పుడు 'కక్కడు' అనే కాటికాపరి విని ఇంటికి వెళ్లి, నిద్రపోతున్న తనభార్యని కత్తితో కోసి, షట్చక్రాల కోసం వెతుకుతాడు. అవి కనపడవు కాని, భార్య చనిపోతుంది. దాంతో పట్టరాని కోపంతో వీరబ్రహ్మేంద్రస్వాములవార్ని చంపడానికి వస్తాడు. అప్పుడు వీరబ్రహ్మేంద్రస్వాములవారు కక్కడి అమాయకత్వానికి జాలిపడి అతని భార్యని బ్రతికించి అతని తలపై చేయిపెట్టి, షట్చక్రాలను చూపిస్తారు. ఈ రెండు
దృష్టాంతరములు కూడా మనకు ఏమి చెపుతున్నాయి? ఆధ్యాత్మిక పరిజ్ఞానములొనూ, యోగమార్గము లొనూ వివరింపబడే అంగములు, స్థానములు, ప్రదేశములు, లోకములు వగైరాలు భౌతికపరిజ్ఞానము వలనగాని శాస్త్రములవలన గాని, తెలియబడవు.  కేవలము, ధ్యానము, తపస్సు వలన గాని, లేదా మహానుభావుల, సద్గురువుల అనుగ్రహము వలన గాని పొందగలిగే అనుభవముల వల్ల మాత్రమే తెలుస్తాయి.)
            10. నిష్కళంకుడై, విరాజమానుడై, అవిద్యాదోషములు లేనివాడై, హిరణ్మయకోశమందున్న పరబ్రహ్మ పరిశుద్దుడు. సకల జ్యోతులకు జ్యోతి, అని ఆత్మ తత్త్వ వేత్తలు తెలుసుకొనియున్నారు.

(For further subject please visit "tatvavisleshana.weebly.com")

No comments:

Post a Comment