Saturday, June 30, 2012

శుభ అహంకారములు

                         శుభ అహంకారములు
              ఇప్పటివరకు మనం అజ్ఞానం, భ్రమలు, అవస్థలు గురించి తెలుసుకొని, వాటి నుండి బయట పడటానికి, మననిజమార్గంలో ప్రయాణించడానికి తోడ్పడే మార్గదర్శిఅయిన సద్గురువు యొక్క ఆవశ్యకత గురించి తెలుసుకున్నాము. ఆ సద్గురువును చేరే ముందు మనలని మనం ఎలాసన్నద్ధంచేసుకోవాలో తెలుసుకున్నాం. ఇప్పుడుమనకు అవుసరమయ్యే సద్గుణాల గురించి తెలుసుకుందాము. వాటిలో మొదటివి "శుభ అహంకారములు"(Positive Ego). వీటి  గురించి పెద్దలు ఏమి చెప్పారో తెలుసుకుందాము. కొన్ని వివరణలు బ్రాకెట్లలో ఇవ్వడమైనది.

పైంగలోపనిషత్:పంచమాధ్యాయము: 

                  
  నేను మరియు ఈ సర్వవిశ్వము అచ్యుతుడగు పరమాత్మయే! చైతన్యరూపుడనగు నాకంటే అన్యమైనది మరేమియు లేదు. అనునిట్టి అహంకార సంకల్పము సర్వోత్తమమైనట్టిది. నేనీజగత్తుకంటే వేరుగా నున్నాను. నేను వాలాగ్రము (కేశాగ్రము) కంటే అత్యంత సూక్ష్మమైన వాడను. ఈవిధమగు జ్ఞాన సంకల్పముతో నుండునది రెండవఅహంకారము.  ఈఅహంకారము కూడ శుభమైనదే. ఈరీతిగా నున్న రెండు అహంకారములును మోక్షమును ప్రసాదించును ఈ అహంకారములు జీవన్ముక్తులకుండును. (ఇందులోమొదటిది నాలుగు మహావాక్యాలైన "అహం బ్రహ్మస్మి", తత్వమసి", "అయమాత్మా బ్రహ్మ", "ప్రజ్ఞానం బ్రహ్మ" అనే వాటియొక్క సారము. ఈ రకమైన అహంకారభావన (ఆంటే ఈవాక్యాల ద్వారా ఏదైతే ప్రతిపాదింపబడిందో అదే నేను అనే భావన) సర్వోత్తమమైనది. ఇది నిశ్చయముగా పరబ్రహ్మ వైపుకు తీసుకు వెడుతుంది. ఇక రెండవది మన ఆత్మ గురించి మనం తెలుసుకునే స్వస్వరూప జ్ఞానం. దీని గురించి సరియైన వివరణ మనంరోజూ చదువుకునే "మంత్ర పుష్పం"లోవుంది. దాన్ని చూద్దాం. "అనంత మవ్యయం కవిగ్ మ్, సముద్రేంతంవిశ్వశంభువం, పద్మకోశప్రతీకాశాగ్ మ్, హృదయం చాప్యధోముఖం|| అధో నిష్ట్యావితస్త్యాంతే నాభ్యాముపరితిష్ఠతి, జ్వాలమాలాకులంభాతీ విశ్వస్యా యతనంమహత్||  సంతతగ్ మ్ శిలాభిస్తులంబత్యాకోశసన్నిభం, తస్యాంతేసుషిరగ్ మ్ సూక్ష్మం  తస్మిన్ సర్వంప్రతిష్ఠితం||  తస్యమధ్యే  మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖః, సోగ్రభుగ్విజన్   తిష్ఠన్నాహారమజరః కవిః|| తిర్యగూర్ధ్వమధశ్శాయీరశ్మయస్త్యస్య సంతతా, సంతాపయతి స్వం దేహమాపాద తలమస్తకః, తస్యమధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః|| నీలతోయద మధ్యస్తా ద్విద్యుల్లేఖేవ భాస్వరా, నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్యణూపమా|| తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః, సబ్రహ్మ సశివః సహరిః స్స్యేంద్రః సోక్షరః పరమఃస్వరాట్||"  అనంతమైన వాడు, అవ్యయుడు, సర్వజ్ఞుడు, సంసారసాగర అంతాన యుండేవాడు, యావత్ప్రపంచానికి మంగళకరుడు అయిన పరమాత్మ అధోముఖమైన తామరమోగ్గలా, కంఠంక్రింద నాభికి జానెడు దూరంలో వున్న హృదయంలో, దీపశిఖల వరుసతో ఆవృత్త మైనట్లు ప్రకాశిస్తూ విశ్వానికంతటికి ఆవాసమైవున్నది. ఆతామరమొగ్గలాంటి హృదయం నలువైపులానాడులతోచుట్టబడివ్రేలాడుతూ వున్నది. దానిలోపల వున్న సూక్ష్మమైన ఆకాశంలో అంతా నెలకొనివున్నది. దానిమధ్యలో సర్వత్రా ప్రకాశిస్తూ, అన్నిదిశాలా వ్యాపిస్తున్నట్లు వుండే అగ్ని వున్నది. అది మొదట భుజించే ఆహారాని విభజించి ధృఢమైనదిగా చేస్తోంది. దానియొక్కకిరణాలు అడ్డదిడ్డంగాను, ఉర్ధ్వంగాను, అధోముఖంగాను, అంతా వ్యాపించి పాదంనుండి తలవరకూ తన శరీరాన్ని వెచ్చగావుండేటట్లు చేస్తుంది. దానిమధ్య అణుప్రమాణమైన అగ్నిజ్వాల ఊర్ధ్వముఖంగా అమరివుంది. అది నీల మేఘంమధ్యనుండి ప్రకాశించే మెరపుతీగవలె వరిగింజకొసలాసన్నమైనదిగా, బంగారురంగులో అణువులా సూక్ష్మమైనదిగా ప్రకాశిస్తూ వుంటుంది. ఆ అగ్నిశిఖ మధ్యలో పరమాత్మ నెలకొని వున్నాడు. ఆయనే బ్రహ్మ, విష్ణువు, శివుడు, హరి, ఇంద్రుడు, అక్షరస్వరూపుడు, స్వప్రకాశ మానుడు. ఆయనకంటే పరమైనవారు ఎవరూలేరు. ఇక్కడ చెప్పబడిన హృదయం మన భౌతిక శరీరంలోవున్న గుండె కాదు. అది మనకున్న వేరే శరీరానికి సంబంధించినది. దీనిగురించి వేరే అంశంలో ప్రస్తావించడం జరిగింది. దయచేసే చూడగలరు. ఆ హృదయంలో వరిధాన్యం కన్న సూక్ష్మంగా వున్నదానినే, ఇక్కడ కేశాగ్రం కంటే సూక్ష్మంగా ఉన్నదని వర్ణించడం జరిగింది. ఈ రెండూ ఒక్కటే. వేరు కాదు. ఇప్పుడు చెప్పండి. ఆ సుక్ష్మమైనదే నేను అనే భావన మనలను ఆ పరమాత్మవైపు పంపిస్తుందా? లేదా? కాబట్టి ఇదికూడా శుభ అహంకారమే. తప్పనిసరిగా కావలసినదే.) 


           హస్తాదులతో కూడిన శరీరము నేను అనెడి నిశ్చయముగల అహంకారము మూడవది. ఇది లౌకిక మైనది, తుచ్ఛమైనది యగును. ఈ లౌకికాహంకారముతో అభిహతుడైన జీవుడు అధోగతికి పోవుచున్నాడు. బహుకాలము ఈశరీరమే నేననుసంకల్పముతో కూడియున్న ఈ దురహంకారమును  చక్కగా విడచిపెట్టి, శేషించిన పరిశుద్ధాహంకారముతో నున్న జీవుడు శాంతుడై ముక్తిని పొందును. అలౌకికములైన మొదటి రెండు అహంకారములను అంగీకరించి మూడవదైన దుఖఃప్రదాయినియగు లౌకికఅహంకారమును త్యజించవలెను. పిమ్మట మొదటి రెండు అహంకారములను కూడ విడచిపెట్టి, సర్వాహంకృతి వర్జితుడై జ్ఞాని, సర్వోత్తమమగు మోక్ష పదము నధిరోహించుచున్నాడు. భోగేచ్ఛయే బంధమగును. భోగమును విడచిపెట్టుటయే మోక్షమని చెప్పబడును. మనస్సు అభివృద్ధిని పొందుటయే అపకారము. మనోనాశనమే మహా లాభము. జ్ఞానికి మనస్సు నశించును. అజ్ఞానికి మనస్సు శృంఖల యగుచున్నది. జ్ఞాని యొక్క మనస్సు సానందము కాదు. నిరానందము కాదు. చలనము, ఆచలనము కాదు. సత్తు, అసత్తు కాదు. సర్వవికల్పముల మధ్యలో నుండు స్థిరత్వమే జ్ఞానియొక్క మనస్సు. ఆకాశము సూక్ష్మమై యున్నందున కన్పించుటలేదు. సర్వసంకల్ప రహితమైన, సర్వసంజ్ఞా వివర్జితమైన, అవినాశియుడైన, స్వస్వరుపమగు ఈ చిత్ వస్తువును 'ఆత్మజుడు' మున్నగు పేర్లతో చెప్పుచున్నారు. బ్రహ్మజ్ఞానుల దృష్టిలో ఈ ఆత్మ ఆకాశములో నూరవ భాగమంతటి సూక్ష్మముగను, శుద్ధముగాను, నిష్కలముగాను, నిజస్వరుపముగాను, ఏకముగను, అనుభవము నిచ్చుచున్నది. 

యోగవాసిష్ఠము:స్థితి ప్రకరణము:33వ సర్గ:
 

             49-54: ఓ రామా! ఈ జగంబున మూడు విధములైన అహంకారములు కలవు. వానిలో మొదటి రెండునూ  శ్రేష్టములు. మూడవది శ్రేష్టము కాదు. య్యది త్యజింపదగినది. వానిని గూర్చి వచింపుచున్నాను. 


              "ఈ జగత్తంతయూ కార్యరూపము. కారణరూపుడును, నాశరహితుడునునగు పరమాత్మనునేనే. నాకన్యముగా జగత్తేలేదు." అను నీఅహంకారము సర్వోత్తమమని యెరుంగ వలయును. ఈ యహంకారము మోక్షమునే గలుగజేయును కాని బంధము కాదు. ఇయ్యది జీవన్ముక్తునకుండును. "నేనన్నింటి కంటెనూ భిన్నమై (సాక్షి స్వరూపుడనై) కేశాగ్ర భాగము యొక్క నూరవభాగము కంటెనూ సూక్ష్మమై యున్నాను. అనగా నిరవయవుండను". ఇట్టి మనోనిశ్చయమున్ను శుభాహంకృతియే యగును. ఈ రెండవయహంకారమున్ను మోక్షము నే కలుగజేయునుగాని బంధమునుగాదు. 
ఇయ్యది జీవన్ముక్తున కుండును. (జ్ఞానములో) సప్తమభుమికయందుండు వారలకీ  రెండుఅహంకారములును కేవలము కల్పనామాత్రములే కాని వాస్తవములు కావు (జ్ఞానములో గల వివిధభూమికల గురించి వేరే చెప్పుకుందాము). ఇక "హస్తపాదాదియుక్తమగు దేహము మాత్రమే నేనను" నిశ్చయము లౌకికముగా తుచ్ఛమును నగు మూడవ అహంకారమనబాడును. ఇది నీచమైనది. మరియు ఇయ్యది ప్రబల శత్రువని వచింపబడినది. గాన త్యజింపదగును. 


               58. మొదటి రెండహంకారములును, మూడవదియగు దేహాహంకారమువలె ధృఢ పరచుకొని , నేను దేహమునుకానని నిశ్చయిం చిన మీదట ఆ యహంకారములను కూడ త్యజించి వేయుట పూర్వీకులగు మహాత్ముల సమ్మతము.


               62. దుఃఖప్రదమగు ఈ మూడవ అహంకారమును త్యజించి, సర్వాహంభావ, శుద్ధా హంభావ, గురుశుశ్రూషాదులచే సప్తభూమికాదులయందు యేవిధమైన స్థితికలిగియుండుటకు సమర్థుడగునో ఆయారీతిగనే స్వరూప సుఖాది లాభమొందుచూ జీవుడు క్రమముగా పరబ్రహ్మమును ప్రాప్తినొందును. 


                71. ప్రథమమున ఈ జగత్తంతయూ నేనే కాన అంతయూ నాస్వరూపమే యగునని నిశ్చయించి పిదప ఈ దేహాదులు నేను కాను, దేహ సంబం ధములగు ధనపుత్రాదులు నావి గావని భావించి, ప్రతిబంధములన్నియు రహితములగుటచే, పూర్వొక్తమగు పరిశుద్ధాత్మ చైతన్యమును బొంది క్రమముగా సప్తమ భూమిక యందు స్థితి కలిగి, స్వయముగా అపరిచ్ఛిన్నమగు పరిపుర్ణాత్మ స్వరుఉపుడై జీవుడు విదేహకైవల్యము ప్రాప్తినొందును.
                                                             
                              (
Please visit www.tatvavisleshana.weebly.com)   
 

Friday, June 29, 2012

కర్తవ్యాచరణ

                                                    కర్తవ్యాచరణ
       మనం ఈలోకంలో ఎందుకు జన్మించామో, ఎందుకు పరమాత్మను చేరుకోవాలో, ఎలా ఈ ప్రకృతి లో వివిధఅజ్ఞానభూమికలలో ఉన్నామో  తెలుసుకున్న తర్వాత, మన జీవితలక్ష్యమైన పరమాత్మను చేరుకోవటానికి మార్గదర్శకులైన వారిని, అదే సద్గురువుని ఆశ్రయించాల్సిన అవుసరం గురించి తెలుస్తుంది. అప్పుడు యోగ్యుడైన సద్గురువునాశ్రయించి, ఉపదేశాదులు పొంది, అజ్ఞానాన్ని తొలగించు కొని, సప్తవిధభూమికలు కలిగిన జ్ఞానాన్ని పొంది, సద్గురువు పర్యవేక్షణలో పరబ్రహ్మ స్వరూపాన్ని అనుభవములోనికి తీసుకోనివచ్చే యోగాన్ని ప్రారంభించి, జ్ఞానాన్ని, యోగాన్ని, అనుభవాన్ని అను సంధానించుకొనుచూ, ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది సమాధ్యవస్థను పొందుతాము. ఈ విషయమై మహానుభావులు, సనాతనులు చెప్పిన విషయాలను తెలుసుకుందాము. కొన్ని వివరణలు బ్రాకెట్లలో ఇవ్వడమైనది.
సద్గురునాశ్రయము:
అద్వయతారకోపనిషత్:
               
           9. గురురేవ పరబ్రహ్మ, గురురేవ పరాగతిః, గురురేవ పరావిద్యా, గురురేవ పరాయణం, గురురేవ పరాకాష్ఠా, గురురేవ పరంధనం, యస్మాత్తదుపదేష్ఠా, సౌ తస్మాత్ గురుతరో గురుః||
           గురువే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మమును చేరు త్రోవ గురువే. ఆ చేరుటకు కావలిసిన జ్ఞానము గురువే. ఆ చేరుట అనే ప్రక్రియ కూడ గురువే. దానికి కావలసిన సాధనసంపత్తి కూడ గురువే. ఈ విధముగా ఉపదేశికులైన మీరు గురువులలోకెల్ల సద్గురువులు.

 
ముండకో
పనిషత్:ప్రధమ ముండకం:ద్వితీయఖండం:

              
12, 13: బ్రహ్మజ్ఞాని కర్మచే ప్రాప్తించు లోకముల యొక్క తారతమ్యములను పరీక్షించి తెలుసుకొని, మోక్షము కర్మలచేత లభించదని గ్రహించి, వైరాగ్యమును పొంది, బ్రహ్మము నెరుంగుటకై, సమిధలు హస్తమునందు గలవాడై, శ్రోత్రీయుడును, బ్రహ్మనిష్ఠుడునునగు గురువును నాశ్రయింప వలెను. ఆ ప్రకారముగా గురువును చేరినట్టి శాంతశమదమాదిసద్గుణములు కల శిష్యునకు ఆ గురువు అక్షరమును, సత్యమును అగు పరమాత్మను తెలిసికొనుటకు సాధన రూపమగు బ్రహ్మ విద్యను యుపదేశించవలెను. (ఇక్కడ మొదట శిష్యుడు ఎలా తన్ను తాను తయారు చేసుకోవాలో, ఎటువంటి గుణములు, ఆలోచనలు, భావాలు కలిగియుండాలో విశదీకరీంచారు. మొదట ఎవరికివారు, నేను ఏమి చేస్తున్నాను? నేను చేసే వాటికి ఫలితమేమిటి? నేను చేసేది నాకు కావలిసినది ఇస్తుందా? అని ప్రశ్నించు కోవాలి. ఇంకా నాకు నిజంగా కావాల్సినదేమిటి? అందుకు నేను త్రికరణశుద్ధిగా ప్రయత్నంచేస్తున్నానా? అనికూడా ప్రశ్నించుకోవాలి. అప్పుడు నిజంగా బ్రహ్మజ్ఞానులవ్వాలి అనే కోరిక వుంటే, మనం చేసే భౌతికకర్మలు, జప, దాన, యజ్ఞ, వాపీకూపతటాకాది నిర్మాణాలు, ఫలితాన్నిఆశించి చేసే కర్మలు, పనులు ద్వారా పరబ్రహ్మాన్ని తెలుసుకోలేము, అవి మోక్షాన్ని ఇవ్వలేవు అని తెలుస్తుంది. అప్పుడు మనకు నిజంగా ఈ ప్రపంచంపట్ల, అందులో మనం చేసే పనులపట్ల విరక్తి, వైరాగ్యం వస్తుంది. సరిగ్గా ఈ విషయాన్నే శ్రీ ఆదిశంకరాచార్యులవారు బ్రహ్మసూత్రాలలొని మొదటి సూత్రములోనే  మనకు చెప్పారు. "అథాతో బ్రహ్మ జిజ్ఞాసా"  అంటే "పిమ్మట, కాబట్టి, బ్రహ్మమును తెలిసికోనుటకు కోరిక". వెంటనే మనకు ప్రశ్నలు రావాలి. దేని పిమ్మట? ఎందుక్కాబట్టి? సమాధానం ఏమిటంటే, వివేకాదిసాధనసంపత్తి సిద్ధించిన 'పిమ్మట', కర్మఫలం అనిత్యమైనదని, జ్ఞానఫలమైన 'మోక్షం' శాశ్వతమైనదని తెలిసినది 'కాబట్టి' ముముక్షువైనవాడు బ్రహ్మమును తెలుసుకొనుటకు కోరాలి. దీనివల్ల మనకు తెలిసేదేమిటంటే, మనం పరబ్రహ్మను తెలుసుకొని, మోక్షాన్ని పొందుటకు సద్గురువు దగ్గరకు వెళ్ళేముందే, మనల్ని మనం సంస్కరించుకోవాలి, సన్నద్ధపరచుకోవాలి, పవిత్రీకరించుకోవాలి, శుద్ధ మనస్కులవ్వాలి, మనం దేన్ని కోరుకుంటున్నామో నిర్దుష్టంగా తెలుసుకోవాలి, (ఇప్పటిభాషలో చెప్పాలంటే, clear goal fix చేసు కోవాలి), దాని కోసం, నీళ్ళల్లో మునిగిపోయినవాడు ఊపిరికోసం ఎలా కొట్టుకుంటాడో. ఒడ్డున పడ్డ చేప నీళ్ళ కోసం ఎలా కొట్టుకుంటుందో, అల్లా పరితపించాలి. (ఇప్పుడు మనకిమనం ప్రశ్నించుకుందాం. మనం ఎప్పుడైనా అల్లా పరమాత్మ కోసం పరితపించామా?) ఇటువంటి అవస్థను అనుభవిస్తే, అప్పుడు మనకి సద్గురువు అవుసరం కనపడుతుంది. అప్పుడు మనం సద్గురువు కోసం వెతకాలి. అంతేగాని, ఏదైనా క్షణకాలబాధకలిగినప్పుడో, ఏదైనా పుస్తకంలోని రెండువాక్యాలు చదివినప్పుడో, ఎవరిదైనా ఉపన్యాసంలో రెండువాక్యాలు విన్నప్పుడో, క్షణికోద్రేకానికిలోనయి, నాకు అర్జెంటుగా మోక్షం వచ్చెయ్యాలి, అర్జెంటుగా సమాధి వచ్చెయ్యాలి, గురువు కావాలి, గురువు, గురువు అంటూ పరుగులు పెడితే సద్గురువులు దొరకరు. ఒకవేళ దగ్గరలో వున్నా, నిర్మలమనస్సులేని మనకు తెలియరు. కాబట్టి నిజంగా పరబ్రహ్మ ను తెలుసుకోవాలని కోరిక వున్నప్పుడు, దానికి తగిన విధంగా మనలను మనం సన్నద్ధ పరచుకొని, సద్గురువు కోసం వెతికితే, తప్పని సరిగా లభిస్తారు. ఇంకా చెప్పాలంటే,  'ఒక యోగి ఆత్మకధ' లో లాగా, శ్రీపరమహంస యోగానందగారికోసం శ్రీయుక్తేశ్వరగిరిగారు వచ్చినట్లు ఆసద్గురువే శిష్యుని వెతుక్కుంటూ వస్తారు. ఏ మాత్రము అధైర్యపడనవుసరం లేదు. శ్రీగురుమండలి అలా కల్పించగలదు.)

పైంగలోపనిషత్:పంచమాధ్యాయము:


            మొట్టమొదట శమదమాది  సద్గుణములతో, సద్గురువు తన శిష్యుని పరిశుద్ధునిగా చేయ వలెను. ఆ పిమ్మట, ఈ సర్వము బ్రహ్మమనియు, శిష్యుని నీవు పరిశుద్ధుడవనియు బోధన చేయ వలెను. అజ్ఞునకు (అధికారము లేనివానికి) సర్వము బ్రహ్మమే అని ఎవడు చెప్పునో, అతడు ఆ యజ్ఞుని వలన మహా నరకములోనికి త్రోయబడును. (ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అసలు గురువు దగ్గరకు వెళ్ళేటప్పటికే, మనలని మనం సంస్కరించు కొనివుండాలి. అలా చేసుకొని ఉన్నప్పటికీ, ఎమాత్రంగానైనా సందేహాలు గాని, సంశయాలు గాని, అజ్ఞానము గాని ఉన్నచో, గురువు వాటిని పోగొట్టి శిష్యుని పరిశుద్ధుణ్ణి చేయాలి. ఎందుకంటే, విత్తనం మొలకెత్తాలంటే, భూమిని బాగా దున్ని, రాళ్ళు రప్పలు ఏరివేసి చదును చేయాలి కదా! అలా పరిశుద్దుడు కాని శిష్యుని మనస్సులో గురువు ప్రభోధించే పరబ్రహ్మ విషయాలు లోతుగా నాటుకోవు. తర్వాత అనుభవానికి రావు. అలా లేని శిష్యుడు బయట ఏదైనా తప్పుగా చెపితే, ఆ దోషం గురువుకి వెడుతుంది. ఎవరైనా ఏదైనా తప్పుగా చెపితే, వెంటనే మనం, ఈ విషయం ఎవడు చెప్పాడురా? అంటాము. తత్ఫలితంగా గురువు తనస్థానం నుండి దిగజారి అధోగతి పాలవుతాడు. అందువల్ల అధికారం ఆంటే అర్హతవున్న శిష్యునికే పరబ్రహ్మ విషయాలు ప్రభోదించాలి. అలాకాని పక్షంలో మొదట శిష్యునికి అర్హత వచ్చేలా చేసి ఆ తర్వాతే మిగతా విధానం లోనికి వెళ్ళాలి. లేకపోతే శిష్యుడు పైకి వెళ్ళడం అటువుంచి, గురువు అధోగతి పాలవుతాడు.)

         కావున ఎవని బుద్ధి ప్రబుద్ధమైనదో, ఎవనికి భోగేచ్చ నశించియున్నదో, ఎవనికి ఆశలు పోయినవో, అట్టివానికి ప్రాజ్ఞుడగు గురువు, అవిద్య, మాయ, లేనతనికి, వేదాంతబోధ చేయవలెను. దీపమున్నప్పుడే ప్రకాశమునకు ఉనికి కలదు. సూర్యుడున్నప్పుడే దిపమునకు సత్తయుండును. చిత్ సత్తయే జగత్తు నకు సత్త అయివున్నది. జ్ఞాన దృష్టి కలిగినప్పుడు, జ్ఞానోదయమైనపుడు, స్వస్థచిత్తుడవై నాయొక్క వాక్ దృష్టి (బోధ) యొక్క బలాబలములను నీవు గ్రహించగలవు. ఆ విద్య వలననే, సర్వదోషాపహారిణియగు విద్య (ఆత్మ జ్ఞానము) ప్రాప్తించును. జ్ఞానోదయముతో  నేను, నాది అను స్వార్థబుద్ధి నశించి ఉత్తమ పురుషార్థము లభించును. శుద్దాంతః కరణ యందే ఆత్మకార వృత్తినశించును.

యోగవాశిష్ఠము:నిర్వాణప్రకరణము:ఉత్తరభాగము: ఆఖరిసర్గ:


           22, 23: పరమపురుషార్థ (మోక్ష) ప్రదమగు ఆత్మజ్ఞానమునుపదేశించిన గురువుయొక్క యట్టి మహోపకారమునకు దాగిన ప్రత్యుపకారము నే కర్మచే శిష్యులు చేయగలరు? కాబట్టి మనో వాక్కాయ కర్మలచే శిష్యులు గురువునకు ఆత్మనివేదనము (తనను తాను గురుచరణములందు సమర్పించు కొనుట) గావింప వలెను. అదియే గురువులకు దాగిన ప్రత్యుపకారము. అంతేకాని, మరియే ఇతర కర్మచేతను ప్రత్యుపకారము కానేరదు.
                           (Please visit www.tatvavisleshana.weebly.com)          

Thursday, June 28, 2012

మన స్థితి

మన స్థితి
                 పరమాత్మ సృజించిన సృష్టిలో ప్రస్తుతం మనం ఏ స్థితిలో ఉన్నామో, అంటే ఎలా భ్రమల్లో, అజ్ఞానంతో ఆయా ఆవస్థలలో ఉన్నామో తెలుసుకుందాం. మనం గతంలో, ఇప్పుడు, భవిష్యత్తులో ఉన్న, ఉండబోతున్న భ్రమలు, అవస్థలు, అజ్ఞానం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే, అజ్ఞానాన్ని తెలుసుకుంటే, దానినుండి బయటపడి, సమ్యక్ జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాము కాబట్టి. భ్రమలనుండి బ్రహ్మాన్ని చేరే విధానం తెలుసుకుంటాము కాబట్టి. ఈ విషయంలో సనాతనులు, పెద్దలు, తత్త్వవేత్తలు ఏమి చెప్పారో తెలుసుకుందాం. కొన్ని వివరణలు బ్రాకెట్లలో ఇచ్చాము. 
భ్రమలు:
అన్నపూర్ణోపనిషత్:ప్రధమాధ్యాయము:
                 భ్
రమలు 5 విధములు. జీవుడు ఈశ్వరుడు భిన్నరుపులు అనునది మొదటి భ్రమ. (మనం సాధారణంగా చేసే మొదటి పొరపాటు ఇదే. మనలో ఉన్న ఆత్మ, పరమాత్మ వేరే అనుకోవడం. పైంగలోపనిషత్ ప్రకారం, "సృష్టి అంతా ఏర్పాటు అయిన తర్వాత ఆ సృష్టి అంతా జడముగా, ఎటువంటి స్పందన లేకుండా వున్నది. అప్పుడు పరబ్రహ్మ ఈ పరిస్థితిని గమనించి, ఈ సృష్టిలో  చైతన్యము అనగా తాను లేనందున ఇది అంతా జడముగా ఉన్నదని, బ్రహ్మండములను, సమస్త వ్యష్టి శరీరముల యొక్క మస్తకములను బ్రద్దలుచేసి, ఆ బ్రహ్మరంధ్రముల వాటన్నింటి యందు చైతన్యరూపములో ప్రవేశించెను. ఆ శరీరములు మొదట జడములుగా నున్ననూ, ఈశ్వరచైతన్యము ప్రవేశింపగనే చైతన్యవంతములైనవి. ఈశ్వరుడు దేహత్రయతాదాత్మ్యము వలన కర్తృత్వమును భోక్తృత్వమును కలవాడయ్యెను. జీవుడుగా నున్న ఈశ్వరుడు  స్థూల సూక్ష్మ కారణ దేహములను తానుగా అంటే దేహమే తానను భ్రాంతిగా భావించుట వలన, మేలుకొనుట, స్వప్నములను గాంచుట, నిద్రపోవుట, మూర్ఛిల్లుట, మరణము పొందుట మొదలగు ధర్మములను కలిగినవాడై కులాల చక్రము, కుమ్మరి సారె వలె పరిభ్రమించుచున్నాడు."  చూసారా! సృష్ట్యాదిలో ఆ పరమాత్మే మనశరీరాల్లొ చైతన్య రూపంలో ప్రవేశిస్తే గాని మనకు వున్న జడత్వము పోలేదు. కాబట్టి మనలో నున్నది అంటే ఆత్మ ఆ పరమాత్మ యొక్క అంశమే! ఈవిషయములొ ఏమాత్రము తేడాగాని, పొరబాటు గాని లేదు.) ఆత్మనిష్టమైన కర్తృగుణము వాస్తవమనునది(నేను అంటే  అర్థము దేహము అనే భావము) రెండవ భ్రమ.  శరీరత్రయముతో గూడిన జీవుడు సంగము కలవాడన్నది (స్థూల సూక్ష్మ కారణ దేహములతో కూడిన పరమాత్మ ఈ పాంచభౌతిక దేహముతో సంగముకలవాడనే భావము) మూడవ భ్రమ.  జగత్కారణ రూపమునకు వికారిత్వము (పరమాత్మ వేరే, ప్రకృతి వేరే అనే భావము) నాల్గవ భ్రమ. కారణముకన్న భిన్నమైన జగత్తు సత్యమన్నది (మన కంటికి కనబడే ఈప్రకృతి శాశ్వతమైనదనే భావము) పంచమ భ్రమ.
                పంచభ్రమ నివృత్తియు అప్పుడు చిత్తమున స్పురించెను. బింబ ప్రతిబింబ దర్శనము చే భేద భ్రమ తొలగిపోయెను. (అద్దము లో మన ప్రతి బింబాన్ని మనం చూసుకుంటే, బింబము వేరు, ప్రతిబింబము వేరు కాదు. అలాగే మన శరీరములో ప్రతిబింబించిన ఆత్మ పరమాత్మ రూపమే. వేరుకాదు.) స్పటిక లోహిత దర్శనముచే పారమార్ధిక భ్రమ పోయినది. (స్పటికము అంటే ఏదైనా రత్నముమీద బయటినుండి కాంతి పడినప్పుడు ఆ కాంతి ఆ రత్నం లోపలనున్న వివిధ కోణాలలో నున్న తలాలలో ప్రతిఫలించి ఇంకా కాంతివంతముగా కనపడుతుంది. అప్పుడు మనం ఆ కాంతి ఆ రత్నానిదే అనుకొంటాము. కాని నిజానికి ఆ కాంతి వేరే చోటునుండి వచ్చినది. కాని మనం ఈ ప్రతి ఫలించడం అనే భ్రమలో  పడిపోయి ఆ కాంతి రత్నానిదే అనుకొంటాము. అలాగే నేను అన్న దానికి మనకు భౌతికంగా ప్రత్యక్షంగా కనపడే ఈ శరీరం కాదు. ఇప్పుడు మనకి మనం కొన్ని ప్రశ్నలు వేసుకొందాము. నేను తొడుక్కున్న చొక్కా ఎవరిది? జవాబు నాది. నేను పెట్టుకున్న వాచీ ఎవరిది? జవాబు నాది. ఈ శరీరం ఎవరిది? జవాబు నాది. ఈ మూడో జవాబులో వున్న 'నాది' అన్నది ఎవరూ? ఆలోచించండి. ఈ శరీరం కాక ఇంకోటేదో ఈ శరీరాన్ని నాది అంటోంది. అదే ఆత్మ. 'నేను'  అనే పదానికి నిజమైన కర్త ఆత్మే.)  ఘటమఠాకాశ దర్శనముచే సంగి అన్న భ్రమ తొలగిపోయెను. (మన ఇంటిలో ఒక కుండను చూడండి. ఆ కుండలో ఏమి లేకపోయినా శూన్య ప్రదేశము అంటే ఆకాశము వుంటుంది. అలా చూస్తూ వుంటే మనం ఆ ఆకాశమునకు  కుండతో వున్న సంబంధం వల్లే అలా వుందని, లేకపోతే దానికి ఉనికి లేదని అనుకుంటాము. మనం ఆ కుండను  బ్రద్దలు కొట్టామనుకోండి. అప్పుడు ఆ కుండలో వున్న ఆకాశము, కుండ బయట వున్న మహా ఆకాశము తో కలసి పోతుంది. కుండ లేకపోతే ఆకాశము యొక్క ఉనికికి ఏమాత్రం భంగము వాటిల్లదు.  అల్లాగే ఈ శరీరంలో వున్న ఆత్మ ఈ శరీరము తో వున్నట్లు కనిపించిన, నిజానికి లేదు. ఈ శరీరము లేకపోతే ఆ పరమాత్మ లో వుంటుంది. అందువల్ల ఆత్మకు ఈ శరీరముతో ఎంతమాత్రము సంగము అంటే సంభందము లేదు.) కనకరుచిక దర్శనముచే వికారిత్వ భ్రమ పోయినది. (మన ఇంట్లో వున్న ఉంగరము, నెక్లేసు, పాపిడి చేరు, గాజులు, వడ్డాణము, అరవంకీలు వంటి బంగారు ఆభరణాలు పరిశీలించండి. వాటికన్నింటికీ వేరువేరు ఆకారాలు, రూపాలు, పేర్లు వున్నాయి. దేనికదే విడివిడిగా దాని ప్రత్యేకత దాని కుంటుంది. ఇప్పుడు మరల వాటి నన్నింటినీ వాటికి మూల వస్తువైన బంగారంలా చూడండి. ఇప్పుడవన్నీ ఒక్కటే! ఒకే మూల వస్తువైన బంగారం రకరకాలైన రూపాలుగా మార్చుకుని, రకరకాలైన వస్తువులుగా, రకరకాల పేర్లతో పిలువబడుతోంది. అదే ఒక్క బంగారమే. అలాగే ప్రకృతిలో ఎన్ని రకాలుగా మారి కనిపించినా, వాటికన్నింటికి మూల కారణమైన పరబ్రహ్మ ఒక్కటే!) రజ్జుసర్ప దర్శనముచే కారణభిన్నజగత్తుకు సత్యత్వ భ్రమ పోయినది. (చీకటిలో మనం తాడును చూసి పాములా భ్రమ చెందు తాము. ఆ పాముని నిజమనుకొని చంపడానికి కర్ర తెస్తాము. ఈలోగా ఎవరో దీపం తెస్తారు. ఆ వెలుతురులో తాడుని చూసి అయ్యో నేను పాము అనుకొన్నది నిజంగా తాడా! అనుకొంటాము. ఇప్పుడు చూడండి. దీపం వెలుతురు లేనంతవరకు పాము సత్యము. వెలుతురు పడినతర్వాత తాడు సత్యము. అలాగే మనం చూసేటటువంటి, అనుభవానికి వచ్చేటటువంటి ఈ ప్రకృతినే నిత్యమని, సత్యమని, శాశ్వతమని తలుస్తాము. నమ్ముతాము. కాని  తత్వ విచారమనే దీపాన్నితెచ్చి, జ్ఞానమనే వెలుతురులో చూస్తే, నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది ప్రకృతి కాదని, దానికి మూలకారణమైన పరమాత్మని తెలుస్తుంది.)   అప్పుడు భ్రమల్లో నున్న నా చిత్తము బ్రహ్మాకార మైనది.   
(తదుపరి విషయము కొరకు www.tatvavisleshana.weebly.com సందర్శించండి.)

Saturday, June 23, 2012

అదేమిటి?

                     పరబ్రహ్మ స్వరూపమేమి?

              మనం పరబ్రహ్మ స్వరూపాన్ని ఎందుకు తెలుసుకోవాలో విచారించిన పిమ్మట అదేమిటో తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది మహనీయులు, బ్రహ్మాన్ని తెలుసుకొన్న వాడు బ్రహ్మమే అవుతాడని స్వానుభవంతో తెలియజేసారు. కొందరు బ్రహ్మాన్ని తెలుసు కొన్నాననుకొంటే అజ్ఞానమని, తెలుసుకోలేక పోయానని తెలుసుకొంటే, దాని గురించి తెలియటం మొదలవుతుందని చెప్పారు. ఎంత చెప్పినా అది పూర్తి అవదని, దానికి నిర్వచనాలు లేవని, కేవలము అనుభవపూర్వకమని కొందరు తెలియజేసారు. మనం గతంలో అనుకున్నట్లు నిజంగా పరబ్రహ్మను పొందినవాడు ఈలోకంలో ఉండడు. కాని కొంతమంది మహానుభావులు ఆస్థితిలో చివరి వరకూ  వెళ్లి, మళ్లీ వెనక్కు వచ్చి, మనలాంటి వారికోసం కొంతవిషయాన్ని అక్కడక్కడ చెప్పారు. ఒకమాట మాత్రం నిజం. మనం మనుష్యులం కాబట్టి, మాయామయమైన శరీరంతోటి, అంతఃకరణాలతోటి జీవిస్తున్నాం కాబట్టి, ఈ అజ్ఞానం తొలగే వరకూ (పూర్తిగా పనికి రానప్పటికీ) కొంచెం ప్రాపంచకమైన జ్ఞానంతోటి, మన బుద్ధికి, మనస్సుకు అందే విషయాలతోటి దాన్ని తెలుసుకొనేందుకు ప్రయత్నిద్దాం.  అంతవరకూ దోషమేమీ లేదు. దాని సంగతి తెలిసిన పిమ్మట, దాని కోసం ఉపయోగించిన ప్రాపంచిక విషయాలను వదలివేసి, పూర్ణ మైన జ్ఞానాన్ని మాత్రమే ఆశ్రయిద్దాం. ఎందుకంటే "సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ" కాబట్టి.
              ఈ విషయమై అనుభవం పొందిన మహాత్ములు, అనన్యచింతనులు, ఋషులు, యోగులు ఏ విధంగా తెలియజేశారో పరిశీలిద్దాం.  (కొన్ని వివరణలు బ్రాకెట్లలో యివ్వడమైనది).
ఈశావాశ్యోపనిషత్:
             
4. పరమాత్మ ఒక్కటే చలనరహితమైనది. అయినా మనస్సుకంటే మహావేగము కలది.  మనసుకంటే ముందే వెళ్ళుటవలన, అది యింద్రయములకు చిక్కదు. నిత్యమైనది. స్థిరమైనది అయినప్పటికీ, పరిగెత్తే అన్నింటిని అది దాటి పోవుచున్నది.  ఆత్మ సాన్నిధ్య మున్నందు వలననే జీవకోటులు తమ కార్య కలాపములను సాగించుటకు సమర్థవంతము లగుచున్నవి. (ఇక్కడ పరమాత్మ యొక్క వైవిధ్యలక్షణాలను చెపుతున్నారు. పరమాత్మ అన్నిచోట్ల ఉన్నందున మనం ఎంత వేగంగా వెళ్ళినా, అక్కడ మనకన్నా ముందరే వెళ్లి ఉన్నట్లు తోస్తుంది. అందువలన అది ఎక్కడికి వెళ్ళనప్పటికీ అత్యంత వేగంగాఉన్నట్లు తోస్తుంది. మనం గజేంద్రమోక్షంలో తెలుసుకున్నట్లు ఆ పరమాత్మ ప్రవేశించినందు వల్లనే ఈ జీవులన్నియూ చైతన్యవంతములై తమతమ కార్యకలాపములను చేయు సమర్థములైయున్నవి.)        

             
5. ఆ ఆత్మ చలింపదు. దూరములో నున్నది. దగ్గరగా నున్నది. అదియే సర్వ వ్యాపకముగా నున్నది. ఈ అంతటి వెలుపల, లోపల గూడ నున్నది. (పైన చెప్పినట్లు ఆ పరమాత్మ అన్నిచోట్ల ఒకేసారి ఉన్నందున ఈ విధంగా తోస్తుంది. ఒకసారి చర్చలలో, ఒకేసారి దూరంగానూ, దగ్గరగాను ఎలా వుంటుంది? అన్న ప్రశ్న వచ్చింది. మనం ఎదురెదురుగా (face to face) కూర్చుంటే ఎలా వున్నాము? చాలా దగ్గరగా వున్నాము. అలా ఉన్నచోటనే ఒకరి కొకరు వ్యతిరేకదిశలో కూర్చుంటే ఎలా వున్నట్లు? ఎంత దూరంలో వున్నట్లు? ఒక్కసారి ఆలోచించండి! అలాగే మనం పరమాత్మ వైపు తిరిగితే మనకు ఆయన చాలా దగ్గరగా ఉంటాడు. ఆయనకేసి తిరగకపోతే చాలా దూరంగా ఉంటాడు. ఇక్కడ చెప్పిన ఆయన సర్వవ్యాపకత్వాన్నే
మనం ప్రతిరోజూ చదువుకొనే మంత్ర పుష్పంలో "యచ్ఛకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా, అంతర్ బహిశ్చతత్సర్వం వ్యాప్యనారాయణ స్థితః" అంటే 'ఏదయితే మనకు కనపడుతూ, వినపడుతూ వుండే ప్రకృతి  వుందో, దాని లోపలా బయటా అంతా ఆపరమాత్మే నిండివున్నాడు' అని శృతి చెప్పింది.)
              8. స్వయంభువు, సర్వవ్యాపి, అశరీరి, అస్నాయువు, పాప కళంక రహితుడు, ఉజ్జ్వలుడు, పరిపూర్ణుడు, స్వచ్ఛమైనవాడు, సర్వదర్శి, సర్వవిదుడు, సర్వ పరిఛ్చేదకుడు, అయిన పరమాత్మ శాశ్వతులైన ప్రజాపతులకు వారివారి కర్తవ్యములను నిర్ణయించి యిచ్చినాడు.
కేనోపనిషత్: ప్రధమ ఖండం:
              ౩. పరబ్రహ్మమును నేత్రముతో చూచుటకు వీలుకాదు. వాక్కుతో చెప్పుటకు వీలు కాదు. మనస్సుతో చింతించుటకు వీలుకాదు. అట్టి ఆత్మను బోధించుట ఎట్లు? మాకు తెలియదు. అది తెలియువాటికి, తెలియబడని వాటికి, అతీతముగా నున్నది. మా గురుదేవులు (సనాతనులు) ఈ రీతిగా చెప్పు చుండుట వినియుంటిమి.   
               4-8. ఏ ఆత్మ వాగింద్రియముచేత గ్రహించబడదో, దేని శక్తిచేత వాగింద్రియము పని చేయుచున్నదో, దీనిని చక్షుస్సు చూడ లేదో, దేనిచే అంతఃకరణవృత్తులను చూచునో, దేనిని చెవితో వినుటలేదో, దేనిచేత ఈశ్రవణేన్ద్రియము పనిచేయుచున్నదో, ఏది మనసుచేత భావించుటకు అశక్యమగునో, దేనిచేత మనస్సు పనిచేయుచున్నదో, అద్దానినే పరబ్రహ్మమని తెలియుము. అన్యమేదియు బ్రహ్మము కాదు. ఏది ఉచ్చ్వాస నిశ్వాసాత్మకమగు ప్రాణ క్రియతో తెలియ బడజాలదో, దేనిచే ప్రాణము నిజకర్మమున నడుపబడుచున్నదో, అదియే బ్రహ్మమని ఎరుంగుము. అన్యమైనదేమియు బ్రహ్మము కాదు. (ఇక్కడ మన శరీరము భౌతికవిషయ పరిజ్ఞానాన్ని గ్రహించే అవయవాల ద్వారాగాని, శరీర భౌతికకర్మల ద్వారాగాని,  పరబ్రహ్మమును తెలిసికోలేమని, ఈ అవయవాలని, వాటిని నడిపించే మనస్సుని కూడా పనిచేయించేది పరబ్రహ్మమని మనకు తెలియజేస్తున్నారు.)   
చతుర్థఖడం:
           
4. విద్యుత్తు యొక్క ప్రకాశమువలె కన్ను తెరచినప్పుడు వస్తువులు చూడనగును. అది మూయగానే వస్తువులు కనిపింపవు. క్షణమాత్రము మెరుపు మెరసినపుడు కన్నులు మిరుమిట్లు గొలుపును. విద్యుత్తు క్షణ మాత్రమే ప్రకాశించును. అట్లే బ్రహ్మము యొక్క దర్శనము కూడా! (ఇక్కడ బ్రహ్మదర్శనం లేదా ఆత్మదర్శనం గురించి చెపుతున్నారు. మొట్టమొదట్లో ధ్యానంలో ఏకాగ్రత కుదిరినప్పుడు ఎలా ఆత్మ దర్శనం అవుతుందో ఒకసారి గురువుగారు చెప్పారు. చీకటిలో మిణుగురుపురుగు వెలిగినట్లు కనపడుతుందట. వెంటనే మాయమైపోతుందట. తర్వాత ఏకాగ్రత కుదిరిన కొద్దీ కదలకుండా ఉంటుందట. ఈవిషయాన్నే ఉపనిషద్రష్ట తెలియజేస్తున్నారు.)
            6. పూర్వము వర్ణింపబడిన బ్రహ్మమే 'తద్వనం' అనబడును. ఆబ్రహ్మమును సర్వభూతాత్మగా ఉపాసించవలెను. బ్రహ్మను
'తద్వనం' అని ధ్యానించవలెను. సర్వప్రాణులు అతనిని ఆ విధముగానే కోరును. 
కఠోపనిషత్:ప్రథమాధ్యాయము: 6వ వల్లి:
            17. అంగుష్ఠమాత్ర పరిమాణము గల హృదయపద్మ పురుషుడు అంగుష్ఠమాత్రుడనబడును. అట్టి అంగుష్ఠమాత్ర పురుషుని, ముంజ యను తృణవిశేషము నుండి తదంతర్గతయగు ఇషీక, పరకను వెలుపలకు లాగునటుల సర్వశరీరము నుండి జ్ఞానము చేత వేరు పరచవలెను. వేరు పరచిన చిన్మాత్రుడగు ఆయాత్మనే శుద్ధమైన బ్రహ్మముగా నెరుంగవలెను. (ముంజ అనేది ఒకరకమైన గడ్డి. దాని ఆకులలో ఈనె వుంటుంది.  కొబ్బరిఆకుల లోంచి ఈనెను బయటకు లాగునటుల ఈ ముంజగడ్డి ఆకులలోంచి కూడా ఈనెను బయటకు లాగవచ్చును. ఆ ప్రకారంగా మన శరీరంలో ఆత్మచైతన్య రూపంలో వున్న పరమాత్మను జ్ఞానంతో వేరుపరచి దర్శింపవలెను.)
మున్డకోపనిషత్:ప్రధమమున్డకం:
ప్రధమఖండం:
             6. ఈ పరబ్రహ్మ తత్త్వము దర్శించుటకుగాని గ్రహించుటకుగాని వీలుకానిది. సంబంధము లేనిది. రంగులు, రూపములు కాని, నేత్రములు శ్రోతములు గాని, హస్తములు పాదములుగాని లేనిది. నిత్యమైనది. సర్వ వ్యాపకమైనది. సర్వగతము. అత్యంత సూక్ష్మము. అవ్యయము. సమస్త భూతముల యొక్క ఉత్పత్తి స్థానమై యున్నది. తెలిసిన బ్రహ్మజ్ఞానులు సర్వత్ర ఈఆత్మనే దర్శించుచుందురు. (ఇక్కడ ఒక విషయం, మన భారతీయ విద్యావిధానం ఎంతగొప్పదో మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి.  ఒక భాష గురించి చెప్పే మొదటి పాఠం లోనే భాషతో పాటు పరమాత్మ జ్ఞానం కూడా ఇచ్చారు.  తెలుగు వ్యాకరణంలో మొదటి పాఠం భాషాభాగాలు. అవి, నామ వాచకము, సర్వ నామము, క్రియ, విశేషణము, అవ్యయము, మొత్తం 5. వీటిలో అవ్యయము అంటే లింగ, వచన, విభక్తులు లేనిది. ఈ గుణం పరమాత్మకు చెందినది. అంటే పరమాత్మకు చెందిన జ్ఞానం మనకు మొదటి పాఠం లోనే చెపుతున్నారు. కాని మనం దానిని పట్టించుకోకుండా పెరిగి మళ్లీ దాని కోసమే ఎక్కడెక్కడో వెతుకుతాము.)
ద్వితీయమున్డకం:ప్రథమఖండం:
             2. ఆ అక్షర పరబ్రహ్మము జన్మలేనిదై, బాహ్యాభ్యంతరములలో నిండినదై. సమస్త రూపరహితమై, పరిపూర్ణమై, ప్రకాశించుచున్నది. అందువలననే ప్రాణములేనిదై ఆవ్యాకృతాది సర్వవికారముల కంటే భిన్నమై, నామరూపముల కంటే విలక్షణమై, ఉపాధి లేనిదై పరిపూర్ణముగా ప్రకాశించుచున్నది.                               
                           
ద్వితీయఖండం:
             1, 2. ప్రకాశము కలదై, అత్యంత సన్నిహితమై, హృదయగుహలో సంచరించుచున్నదై, మహత్తై, సమస్తమునకు అధారమై, సమస్త విశ్వము తనలో ధరించియున్నదై ప్రకాశించు నీబ్రహ్మమే చలనము కలిగి, ప్రాణవాయువు పీల్చి నిమేషములు కలిగియున్నది. ఈ పరబ్రహ్మమును సత్తుగాను, అసత్తుగాను, సకల ప్రజలలోను ప్రతిష్టమైయున్నదిగాను, పరమైనదిగాను, ప్రాణుల జ్ఞానమునకు అతీతముగా నున్నదాని గాను తెలిసికొనుము. ఏది కాంతి కలదో, అణువుకంటెనూ అణువైనదో, దేనియందు పృథివ్యాది లోకములను, మనుష్యాదులను ఉంచబడినారో అదియే అక్షర బ్రహ్మము. అదియే ప్రాణము. అదియే వాక్కు, మనస్సు. ఆ పరబ్రహ్మమే సత్యము. దదియే అమృతము, నాశరహితము. అదియే మనస్సునకు లక్ష్యముగా చేయ దగినది. అట్టి పరబ్రహ్మమును తెలిసికొనుము.  (ఇక్కడ పరమాత్మ హృదయగుహలో ఉన్నాడని చెపుతున్నారు. ఆ హృదయము గురించి మంత్రపుష్పంలో "అనంతమవ్యయం కవిగ్ మ్ సముద్రేంతం విశ్వశంభువం| పద్మకోశ ప్రతీకాశ
గ్ మ్ హృదయంచాప్యథోముఖం|| అధో నిష్ట్యా వితస్త్యాన్తే నాభ్యాముపరి తిష్టతి| జ్వాలమాలాకులం భాతీ విశ్వస్వాయతనం మహత్||" అనంతుడు, అవ్యయుడు, సర్వజ్ఞుడు, సంసారసాగర అంతముననుండేవాడు, విశ్వ మంగళకారుడు, అయిన పరమాత్మ అధోముఖమైన తామరమొగ్గలా వున్న హృదయంలో వున్నాడు. ఈ హృదయం కంఠానికి క్రింద, నాభికి పైన జానెడు దూరంలోవుంది. ఇందులో  విశ్వానికిఅంతటికి మూలమైన పరమాత్మ దీపశిఖలవరుసతో సమానమైన జాజ్వల్యమానమైన తేజస్సుతో ప్రకాశించు చున్నాడు అని శృతి చెప్పింది. ఇక్కడ చెప్పిన హృదయం మనకు కనపడే గుండె కాదు. మనకు రెండు రకాల శరీరాలున్నాయి. ఒకటి భౌతిక శరీరం (physical body). రెండవది శక్తి శరీరం (energitic body). ఈ రెండవ శరీరంలోనే శక్తిస్థానాలైన షట్చక్రాలూ, హృదయం మొదలైన ఆధ్యాత్మికపరిభాషలో వివరింపబడే అంగాలూ వుంటాయి.  ఈ ఆధ్యాత్మికమైన శరీరం భౌతికమైన అనుభవానికి రాదు. ఈ శరీరం అనుభవం లోనికి రావాలంటే ధ్యానం లేదా తపస్సు ద్వారా తగిన శక్తి (power) సంపాదించు కోవాలి. లేదా ఆశక్తి ఇవ్వగలిగిన వారు ఇవ్వాలి. ఇక్కడ మనకు రెండు గట్టి దృష్టాంతరములు వున్నాయి. భగవద్గీతలో, విశ్వరూపదర్శనయోగములో 8వ శ్లోకంలో కృష్ణపరమాత్మ "నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా| దివ్యం దదామి తేచక్షుః పశ్యమే యోగమైశ్వరం|| ప్రాకృత చక్షువులతో నా రూపమును నీవు నిజముగా చూడజాలవు. కనుక నీకు దివ్య (అలౌకిక) దృష్టిని ప్రసాదించుచున్నాను. ఆ దివ్యదృష్టితో నా ఈశ్వరీయ యోగరూపమును చూడుము, అని అర్జునునికి చెప్పి దివ్య దృష్టిని ప్రాసాదించాడు. ఒకసారి శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారు షట్చక్రాలూ, వాటి స్థానాలనూ వివరిస్తున్నప్పుడు 'కక్కడు' అనే కాటికాపరి విని ఇంటికి వెళ్లి, నిద్రపోతున్న తనభార్యని కత్తితో కోసి, షట్చక్రాల కోసం వెతుకుతాడు. అవి కనపడవు కాని, భార్య చనిపోతుంది. దాంతో పట్టరాని కోపంతో వీరబ్రహ్మేంద్రస్వాములవార్ని చంపడానికి వస్తాడు. అప్పుడు వీరబ్రహ్మేంద్రస్వాములవారు కక్కడి అమాయకత్వానికి జాలిపడి అతని భార్యని బ్రతికించి అతని తలపై చేయిపెట్టి, షట్చక్రాలను చూపిస్తారు. ఈ రెండు
దృష్టాంతరములు కూడా మనకు ఏమి చెపుతున్నాయి? ఆధ్యాత్మిక పరిజ్ఞానములొనూ, యోగమార్గము లొనూ వివరింపబడే అంగములు, స్థానములు, ప్రదేశములు, లోకములు వగైరాలు భౌతికపరిజ్ఞానము వలనగాని శాస్త్రములవలన గాని, తెలియబడవు.  కేవలము, ధ్యానము, తపస్సు వలన గాని, లేదా మహానుభావుల, సద్గురువుల అనుగ్రహము వలన గాని పొందగలిగే అనుభవముల వల్ల మాత్రమే తెలుస్తాయి.)
            10. నిష్కళంకుడై, విరాజమానుడై, అవిద్యాదోషములు లేనివాడై, హిరణ్మయకోశమందున్న పరబ్రహ్మ పరిశుద్దుడు. సకల జ్యోతులకు జ్యోతి, అని ఆత్మ తత్త్వ వేత్తలు తెలుసుకొనియున్నారు.

(For further subject please visit "tatvavisleshana.weebly.com")